ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు విరాళాల సేకరణ కోసం ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని భావించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. బిగ్బాష్ లీగ్ ఫైనల్ ముందు ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే సిడ్నీలో శనివారం వర్షం వచ్చే సూచన ఉండటం వల్ల ఈ మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు.
"శనివారం సిడ్నీ మైదానంలో బిగ్బాష్ లీగ్ ఫైనల్ జరగుతుంది. కానీ ఛారిటీ మ్యాచ్ను నిర్వహించే అవకాశం లేదు. ఆదివారం మెల్బోర్న్ ఓవల్ జంక్షన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది."
-క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన
ఎందరో ప్రముఖులు..
ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్తో పాటు పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, మాథ్యూ హెడెన్, ఆండ్రూ సైమండ్స్, బ్రాడ్ హడిన్, మైక్ హస్సీ, ఆడమ్ గిల్క్రిస్ట్, మైఖెల్ క్లార్క్, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్ వెల్ బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు నాన్ ప్లేయింగ్ కెప్టెన్లుగా ఆసీస్ మహిళా క్రికెటర్ మేల్ జేన్స్, స్టీవ్ వా కూడా కనువిందు చేయనున్నారు.
బిగ్ బాష్ ఫైనల్ శనివారం సిడ్నీ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిడ్నీ సిక్సర్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు తలపడనున్నాయి.