1932 నుంచి నేటి వరకు భారత్- ఇంగ్లాండ్ జట్లు ఆడిన 122 టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి జో రూట్ సారథ్యంలోని ఇంగ్లాండ్తో నాలుగు టెస్టుల సిరీస్లో తలపడనుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బ్యాట్స్మెన్ మరపురాని అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తుచేసుకుందాం.
గ్రాహమ్ గూచ్-333
వేదిక: లార్డ్స్, 1990
మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో 485 బంతుల్లో 333 పరుగులు చేశాడు గ్రాహమ్ గూచ్. 36 పరుగుల వద్దే అతడు ఓ క్యాచ్ ఇవ్వగా వికెట్కీపర్ కిరణ్ దానిని విడిచిపెట్టాడు. దీంతో చెలరేగిన గూచ్.. ఇంగ్లాండ్కు 653/4 పరుగుల భారీ స్కోరు అందించాడు. బదులుగా రవిశాస్త్రి(100), అజారుద్దీన్(121) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్లో 454 పరుగులు చేసింది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 272/4 చేసి 472 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 224 పరుగులకే ఆలౌట్ అవడం వల్ల 247 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్కు విజయం దక్కింది.
కరుణ్ నాయర్- 303 నాటౌట్
వేదిక: ఎంఏ చిదంబరం మైదానం, చెన్నై, 2016
అప్పటికి తన మూడో టెస్టు మాత్రమే ఆడుతున్న కరుణ్.. 303 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ తరఫున త్రిశతకం సాధించిన రెండో బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. అతడి కన్నా ముందు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. కరుణ్ ఇన్నింగ్స్తో టీమ్ఇండియా కెరీర్లోనే అత్యధిక స్కోరు (759/7 పరుగులు) నమోదు చేసింది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 75 పరుగుల తేడాతో ఓడించింది టీమ్ఇండియా.
అలిస్టర్ కుక్- 294
వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్, 2011
ఇండియాను 224 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ ఏకంగా 294 పరుగులు చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 710/7 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 244 పరుగులకే కప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్, 242 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది ఇంగ్లాండ్.
జెఫ్రీ బాయ్కాట్-246 నాటౌట్
వేదిక: హెడింగ్లే, లీడ్స్, 1967
ఇంగ్లాండ్లో 1967లో భారత్ పర్యటించినప్పుడు.. తొలి ఇన్నింగ్స్లో 246* పరుగులతో రెచ్చిపోయాడు జెఫ్రీ బాయ్కాట్. దీంతో 550/4 పరుగులు చేయగలిగింది ఇంగ్లీష్ జట్టు. అనంతరం భారత్ 164 పరుగులకు చేతులెత్తేసింది. టీమ్ఇండియాను ఫాలోఆన్కు ఆహ్వానించగా కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ 148 సెంచరీతో రెండో ఇన్నింగ్స్లో 510 పరుగులు చేసింది. దీంతో 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 6 వికెట్లు చేతిలో ఉండగానే ఛేదించింది ఇంగ్లాండ్.
ఇయాన్ బెల్- 235
వేదిక: ది ఓవల్, లండన్, 2011
నాలుగో టెస్టులో తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్.. 591/6 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ మ్యాచ్లో ఇయాన్ బెల్ 264 బంతుల్లో 235 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్.. 300 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లో 283 పరుగులకే వెనుతిరిగింది. దీంతో ప్రత్యర్థికి ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం దక్కింది.
ఇదీ చూడండి: ఆమెతో పరిచయం అలా..: రహానె