గతేడాది టెస్టు ఓపెనర్గా బరిలోకి దిగి శతకాలతో అలరించిన టీమ్ఇండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ.. త్వరలో ఆసీస్తో తలపడే టెస్టు సిరీస్లో ఏ స్థానంలో బరిలోకి దిగేందుకైనా సిద్ధమని చెప్పాడు. జట్టు అవసరాల ఆధారంగా ఎక్కడైనా ఆడతానని అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిట్మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
"జట్టు యాజమాన్యం నన్ను ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడేందుకు ఇష్టపడతా. ఈ విషయం ఇదివరకే స్పష్టం చేశా, మళ్లీ చెబుతున్నా. అయితే, ఇప్పుడు ఓపెనర్ స్థానాన్ని మళ్లీ మారుస్తారా లేదా అనే విషయం నాకు తెలియదు. విరాట్ లేనప్పుడు ఎవరెవరు ఎలా ఆడాలనే విషయంపై ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న మా జట్టుకు ఒక అంచనా ఉందని అనుకుంటున్నా. అక్కడికి వెళ్లాకే నాకూ స్పష్టత వస్తుంది."
-రోహిత్, టీమ్ఇండియా క్రికెటర్.
ఆస్ట్రేలియా పిచ్లపై పెద్దగా బౌన్స్ ఉండదని.. 2018-19 సీజన్లో ఎంత మంది ఆ బంతులకు ఔటయ్యారని రోహిత్ ప్రశ్నించాడు. పెర్త్ మినహా అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ పిచ్లు సాధారణంగానే ఉంటాయని తెలిపాడు. అలాగే కంగారూ బౌలర్లు కొత్త బంతిని సద్వినియోగం చేసుకుంటారని, చాలా మటుకు తమ బంతుల్ని బౌన్స్ వేయడం లేదా బ్యాట్పైకి సంధించడమే చేస్తారన్నాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడటం కూడా అంత తేలిక కాదని అన్నాడు.
ఏ ఫార్మాట్లో అయినా ఇన్ని రోజుల విరామం తర్వాత రాణించడం కష్టమన్నాడు. ఇప్పుడు తాను టెస్టు క్రికెట్లో ప్రాథమిక అంశాలపైనే దృష్టిసారించానని, అందులో ఆరితేరితే తర్వాత తనకు ఇష్టం వచ్చినట్లు ఆడగలనని వివరించాడు. ప్రస్తుతం తాను మానసికంగా దృఢంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. కెరీర్లో ఎన్నోసార్లు ఇలా ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, వాటి నుంచి ఎలా తిరిగి రావాలో తనకు తెలుసని అన్నాడు. నవంబర్ 27 నుంచి జనవరి 19వరకు ప్రారంభమయ్యే సిరీస్లో ఇరు జట్లు వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు తలపడతాయి.
ఇదీ చూడండి :