Akash Bobba Joins DOGE : ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ టీమ్లోకి భారత సంతతి యువకుడు ఆకాశ్ బొబ్బ చేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) శాఖను ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు అప్పగించారు. తాజాగా ఈ డోజ్ విభాగం ఆరుగురు యువ ఇంజినీర్లను విధుల్లోకి తీసుకుంది. వీరిలో భారత సంతతికి చెందిన ఆకాశ్ బొబ్బ కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు అతడి పేరు నెట్టింట వైరల్ అయ్యింది.
అందరూ యువకులే!
డోజ్ నియమించుకున్న ఆరుగురు కూడా 19 నుంచి 24 ఏళ్లలోపు వయస్సున్న యువకులేనని ఓ అంతర్జాతీయ కథనం వెల్లడించింది. వీరిలో కొందరు ఇటీవలే కాలేజీ విద్యను పూర్తి చేసుకోగా, ఓ యువకుడు ఇంకా చదువుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఎలాంటి అనుభవం లేని వీరిని డోజ్ టీమ్లోకి తీసుకోవడం అగ్రరాజ్యంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన డేటాను సైతం తెలుసుకునేందుకు డోజ్కు అనుమతి ఉంది. అందుకే ఈ యువ ఉద్యోగుల నియామకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ ఆకాశ్ బొబ్బ?
ఆకాశ్ బొబ్బ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా డిలీట్ అయ్యింది. అంతకు ముందున్న వివరాల ప్రకారం, ఆకాశ్ బొబ్బ- బెర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్మెంట్, టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. మెటా, పలంటీర్ సంస్థల్లో ఇంటర్న్గా పనిచేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్లోనూ కొంత కాలం పనిచేసినట్లు తెలుస్తోంది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో అతను నిపుణుడని సమాచారం.
ఆకాశ్ బొబ్బతో పాటు ఎడ్వర్డ్ కొరిస్టీన్, ల్యూక్ ఫారిటర్, గౌటియర్ కోల్ కిలియాన్, గావిన్ క్లిగెర్, ఇథాన్ షావోత్రన్లను కూడా డోజ్ టీమ్లోకి తీసుకున్నారు. వీరిలో షావోత్రన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మస్క్ ఎక్స్ఏఐ నిర్వహించిన హ్యాకథాన్లో ఇతను రన్నరప్గా నిలవడం గమనార్హం.