టీమిండియా మాజీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్ మరోసారి ఐపీఎల్లో తన సేవల్ని అందించనున్నాడు. వచ్చే సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఫిజియోగా బాధ్యతల్ని నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ధృవీకరించింది.
"ఫర్హాత్ మా జట్టుకు సేవల్ని అందించడానికి అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నాం. ప్యాట్రిక్ సారథ్యంలో దిల్లీ జట్టు ఆటగాళ్లు రాటుదేలుతారని భావిస్తున్నాం".
-ధీరజ్ మల్హోత్రా, దిల్లీ క్యాపిటల్స్ సీఈఓ
టీమిండియాకు నాలుగేళ్లు ఫిజియోగా సేవలందించిన ప్యాట్రిక్కు ప్రపంచకప్తో గడువు ముగిసింది. మరోసారి ఐపీఎల్కు తన సేవల్ని అందించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకుముందు ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ఫిజియోగా పనిచేశాడు.
"ఐపీఎల్లో మరోసారి పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. రెండేళ్లుగా దిల్లీ క్యాపిటల్స్ మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్లో మూడో స్థానంలో నిలిచింది".
-ప్యాట్రిక్ ఫర్హాత్, టీమిండియా మాజీ ఫిజియో
ఈ సీజన్లో పేరు మార్చుకుని బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ మంచి ప్రదర్శన చేసింది. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చి మూడో స్థానంలో నిలిచింది.
ఇవీ చూడండి.. యాషెస్ సిరీస్: ఆసీస్ను ఆదుకున్న స్మిత్