స్టార్ హీరోల పేర్లకు ముందు టైటిల్స్ ఉండటం సాధారణమే. వారి ఇమేజ్ ఆధారంగా అవి వారికి లభిస్తుంటాయి. అభిమానులు కూడా వారిని అవే పేర్లతో ప్రేమగా పిలుస్తుంటారు. అయితే కొంతమంది నటులకు కెరీర్ ఆరంభంలో ఉన్న ట్యాగ్లైన్.. స్టార్ ఇమేజ్ పెరిగే కొద్దీ మారిపోతుంటుంది. ఇటీవల 'పుష్ప' సినిమా టీజర్ రిలీజ్కు హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్టైలిష్స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారారు. ఈయనే కాదు ఇప్పటికే కృష్ణ, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి పలు హీరోలు కూడా తమ బిరుదులను మార్చుకున్నారు. దానికి సంబంధించిన వివరాల సమాహారమే ఈ కథనం..
కృష్ణ(Krishna)
కెరీర్ ప్రారంభంలో 'నటశేఖర' బిరుదును సంపాదించుకున్నారు కృష్ణ. అనంతరం మాస్ ఫాలోయింగ్ పెరిగి 'సూపర్స్టార్'గా టైటిల్ మారిపోయింది. 'సింహాసనం' సినిమా నుంచి ఇదే పేరుతో ఆయన కొనసాగుతున్నారు.
చిరంజీవి(Chiranjeevi)
చిరంజీవి.. తనదైన నటనతో మాస్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ ఆరంభంలో 'డైనమిక్ హీరో', 'సుప్రీమ్ హీరో'గా వెలుగొందిన ఆయన్ను 'మరణ మృదంగం' సినిమా తర్వాత ఫ్యాన్స్ ముద్దుగా 'మెగాస్టార్' అని పిలవడం ప్రారంభించారు. ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు.
బాలకృష్ణ(Balakrishna)
మొదట 'యువరత్న'గా బిరుదు లభించింది. ఆ తర్వాత 'నట సింహం'గా మారిపోయింది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్నారు.
నాగార్జున(Nagarjuna)
హీరో నాగార్జునను కెరీర్ ఆరంభదశలో 'యువసామ్రాట్' అని పిలిచేవారు. అనంతరం ఆయన 'కింగ్'గా మార్చుకున్నారు. ఇటీవల నాగ్.. 'వైల్డ్డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మహేశ్బాబు(MaheshBabu)
సూపర్స్టార్ కృష్ణ వారసుడిగా చిన్నవయసులోనే మహేశ్బాబు చిత్రసీమకు పరిచయమయ్యారు. అనంతరం తనదైన నటనతో 'ప్రిన్స్'గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్డమ్ పెరుగుతోన్న నేపథ్యంలో 'పోకిరి' సినిమా తర్వాత సూపర్స్టార్ అయ్యారు.
ఎన్టీఆర్(NTR)
ఎన్టీఆర్కు మొదట 'యంగ్టైగర్' బిరుదు ఉండేది. 'శక్తి' సినిమాతో 'ఏ1స్టార్' టైటిల్ యాడ్ అయింది. కానీ ఇప్పటికీ 'యంగ్ టైగర్' అనే అభిమానులు పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో ఓ చిత్రం చేయనున్నారు.
ప్రభాస్(యంగ్ రెబల్స్టార్-రెబల్స్టార్), రవితేజ(మాస్ హీరో-మాస్ మహారాజ్), నరేశ్(అల్లరి నరేశ్, శుభప్రదం నరేశ్, నాంది నరేశ్) ఇలా వారి టైటిల్స్ ఇమేజ్ పెరిగేకొద్దీ మారిపోయాయి.
ఇదీ చూడండి: యూఎస్కు రజనీ.. కేంద్రం అనుమతి