దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నవేళ.. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ దంపతులు దాతృత్వం చాటుకున్నారు. తమ నాలుగు అంతస్తుల వ్యక్తిగత కార్యాలయాన్ని కరోనా రోగుల కోసం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్కు ఇచ్చారు. దీనిని మహిళలు, చిన్నారులు, వృద్ధులకు క్యారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు అధికారులు. తాజాగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న రోగుల కోసం 15 పడకల ఐసీయూ యూనిట్గా అప్గ్రేడ్ చేశారు. శనివారం నుంచే ఇక్కడ కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
షారుకు, అతడి భార్య గౌరీ ఖాన్ తమ కార్యాలయాన్ని ఏప్రిల్లోనే బీఎంసీకి అప్పగించారు. అయితే వైద్యులు, సిబ్బంది కొరత వల్ల.. మే 29 వరకు భవనాన్ని వినియోగించలేదు. అనంతరం ఐసీయు సదుపాయాన్ని కల్పించడం కోసం జులై 15 నుంచి పనులు ప్రారంభించారు.. ఈ క్రమంలోనే ఐసోలేషన్లో ఉంచిన రోగులను వేరే కేంద్రానికి తరలించారు.
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సాయం చేసేందుకు షారుక్ దంపతులు చాలా కృషి చేశారు. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ ద్వారా పీఎం కేర్స్ ఫండ్కు సహకరిస్తానని షారుక్ తెలిపాడు. ఇప్పటికే రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ జంట మహారాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ ఫండ్ను అందజేసింది.