గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆకస్మిక మరణ వార్తకు 'మెగా'కుటుంబం వెంటనే స్పందించింది. హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పుడు కథానాయకుడు రామ్చరణ్ తన వంతు సాయం అందించాడు. నూర్ భాయ్ కుటుంబానికి రూ.10 లక్షల విరాళం ప్రకటించాడు. తాను హైదరాబాద్ రాగానే వారిని కలుస్తానని చెప్పాడు.
"నూర్ అహ్మద్ మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. మా పేరు మీద ఎన్నోసార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఓ సారి ఆయన హాస్పిటల్లో ఉన్నపుడు స్వయంగా వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" -హీరో రామ్చరణ్