బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వరుస సినిమాలు చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా చోప్రా. అంతేకాదు, వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తగానూ ఆమె వ్యవహరిస్తోంది. తాజాగా ఓ విషయంలో తాను పశ్చాత్తాప పడుతున్నట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది. ముఖ్యంగా శరీర సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తులను ప్రచారం చేసినందుకుగానూ బాధపడుతున్నట్లు తెలిపారు.
బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ప్రియాంక పలు సౌందర్య ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించింది. ఆ సమయంలో ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చిన్నతనంలో నల్లటి శరీరం కలిగి ఉంటే అంత అందంగా ఉన్నట్లు కాదని భావించేదాన్ని అని పేర్కొంది.
గతంలో వివిధ సౌందర్య ఉత్పత్తులకు ప్రియాంక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆమె అనేక విమర్శలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటికి ప్రచారం చేయడం ద్వారా వర్ణ వివక్ష, జాత్యంహకారాలను ప్రచారం చేస్తున్నానని తనపై చర్చ జరిగినట్లు వెల్లడించింది. మరీ ముఖ్యంగా అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం దీనిపై విస్తృతమైన చర్చ జరిగినట్లు చెప్పుకొచ్చింది.
"దక్షిణాసియాలో సౌందర్యాన్ని పెంచుకునే ఉత్పత్తులు వాడటం సర్వసాధారణం, అదొక పెద్ద పరిశ్రమ. ప్రతి ఒక్కరూ వాటిని వాడతారు. మహిళా నటి అయితే, వాటిని వాడటం తప్పనిసరి. కానీ, నా వరకూ అదొక ఘోరమైన విషయం. కానీ, చిన్న తనంలో చామనఛాయ కలిగిన నేను ముఖానికి క్రీమ్, పౌడర్ రాసుకోవడం ద్వారానే అందంగా కనిపించగలనని అనుకునేదాన్ని. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలోనూ నా శరీర రంగు ఆధారంగా అందంగా లేనన్న విమర్శలూ వచ్చాయి."
-ప్రియాంకా చోప్రా, నటి
హాలీవుడ్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత ప్రియాంక సౌందర్య ఉత్పత్తుల ప్రచారానికి దూరంగా ఉంటోంది. తన శరీర రంగు గురించి గతంలోనూ ఆమె ఓ సందర్భంలో మాట్లాడింది. "మా కుటుంబంలో నా తోబుట్టువులు అందరూ అందంగా ఉండేవారు. నేను మాత్రం చామనఛాయతో తక్కువ రంగు కలిగి ఉండేదాన్ని. ఇంట్లో వాళ్లందరూ సరదాగా 'కాళి.. కాళి' అని పిలిచేవారు. నాకు 13ఏళ్ల వయసున్న సమయంలో ముఖానికి క్రీమ్, పౌడర్ రాయడం మొదలు పెట్టా" అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక 'టెక్ట్స్ ఫర్ యు ఇన్ లండన్', 'మ్యాట్రిక్స్4' చిత్రాల్లో నటిస్తోంది.