సినీ ప్రపంచంలో బిపాసాబసు ప్రత్యేక ఆధిపత్యం ప్రదర్శించింది. 2016 సంవత్సరంలో మోడల్, నటుడు కరణ్సింగ్ గ్రోవర్ను పెళ్లి చేసుకొని జీవనం సాగిస్తోంది. ఇప్పటి కొత్త తరం భామలకు సవాల్ విసురుతున్న బిపాసా బసు ప్రయాణం గురించి కొన్ని విషయాలు..
లేడీ గూండా..
మధ్య తరగతికి చెందిన బెంగాలీ కుటుంబంలో జనవరి 7, 1979న జన్మించింది. ఎనిమిదో యేట వరకు దిల్లీలోనే పెరిగింది. ఆ తరువాత కుటుంబం కోల్కతాకి మారింది. అక్కడే భారతీయ విద్యాభవన్లో చదువుకొంది. ప్రాథమిక విద్య మాత్రం దిల్లీలోని ఆపీజె హైస్కూల్లో సాగింది. ముగ్గురు అక్కచెల్లెళ్లలో రెండో అమ్మాయి బిపాసా. స్కూల్లో అందరూ లేడీ గుండా అనేవారట.
సేమ్ డైలాగ్
చాలామంది నటులు డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. బిపాసా డైలాగ్ కూడా అదే. స్టెతస్కోప్ మెడలో వేసుకొని తిరిగాలనేది ఆమె కల. అందుకే.. ఇంటర్ వరకు సైన్సు చదువుకుంది. మధ్యలో మాత్రం మనసు మార్చుకొంది. కామర్స్ వైపు అడుగులేసింది. బి.కామ్ పూర్తయ్యాక ఛార్టెడ్ అకౌంటెన్సీ చేయాలనుకుందట. మధ్యలో అంటే పదిహేడేళ్ల వయసులోనే మోడలింగ్వైపు దృష్టి పెట్టింది.
ఆయన పరిచయంతో
చదువుకొంటున్న రోజుల్లో మెహర్ జెస్సీ రామ్పాల్తో పరిచయమైంది. అతని సూచనతోనే మోడలింగ్ వైపు అడుగులేసింది. కోల్కతాలో ఉన్నప్పుడే గోద్రెజ్, ఫోర్డ్ కంపెనీల తరపున పలు ప్రకటనల్లో మెరిసింది.
వినోద్ఖన్నా చూశాక..
మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నప్పుడు బిపాసా ఓ కాంటెస్ట్లో పాల్గొంది. దానికి న్యాయనిర్ణేతగా నటుడు వినోద్ఖన్నా హాజరయ్యారు. అప్పుడే బిపాసాని చూశాడు. ఆమె తీరును పరిశీలించి తన తనయుడు అక్షయ్ ఖన్నా నటించాలనుకొన్నా 'హిమాలయ్ పుత్ర' అనే సినిమా కోసం ఎంపిక చేశాడు. అయితే అప్పటికింకా సినిమాల్లో నటించేంత పరిజ్ఞానం లేకపోవడంతో బిపాసా ఆ అవకాశాన్ని తిరస్కరించింది. దీంతో ఆ పాత్రను అంజలా జవేరి సొంతం చేసుకొంది.
కొన్నాళ్లకు జయాబచ్చన్ దృష్టిలో పడింది బిపాసా. ఆమె కోరిక మేరకు 'ఆఖరీ మొఘల్' అనే చిత్రంలో అభిషేక్ బచ్చన్ సరసన నటించడానికి ఒప్పుకొంది. అయితే ఆ కథ కుదరపోవడంతో మధ్యలోనే స్క్రిప్టుని మార్చేశారు. అలా తొలి ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయి.
సెక్స్ సింబల్
బిపాసా తొలి అగుడుగుల్లోనే సెక్స్ సింబల్ అనే గుర్తింపును తెచ్చుకొంది. పలు చిత్రాల్లో ఆమె మొహమాటం లేకుండా అందాలు ఆరబోసింది. 'జిస్మ్'లో అయితే జాన్ అబ్రహామ్ సరసన మరింత ఘాటుగా కనిపించింది. వ్యాపార ప్రకటనల్లో కూడా ఇదే తరహాలో నటించడంతో కొన్నిసార్లు వివాదాలు తలెత్తాయి. 'నో స్మోకింగ్', 'ఓంకారా' చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేసి అలరించింది
ఎన్నో విజయాలు
తొలి చిత్రం తరువాత బిపాసాకి వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం లేకుండా పోయింది. 'రాజ్', ఆమె తొలి కమర్షియల్ చిత్రంగా నిలిచింది. ఆ తరువాత 'జిస్మ్', 'నో ఎంట్రీ', 'ఫిర్ ఫెరా ఫెరి', 'ధూమ్2', 'రేస్' తదితర చిత్రాలతో విజయకేతనం ఎగరేసింది. ఆ చిత్రాల తరువాత బిపాసా పేరు మార్మోగిపోయింది. క్రేజ్ తగ్గుతుందనుకొంటున్న దశలోనే ఇలా ఒక్కో సినిమాతో మెరుపులు మెరిపించడంతో ఆమె ప్రయాణం బ్రేకు లేకుండా సాగిపోయింది. మధ్యలో 'అపహరణ్', 'కార్పోరేట్', 'బచ్ నా యే హసీనా' చిత్రాలతో నటిగా కూడా గుర్తింపును తెచ్చుకొంది.
దక్షిణాదినా మెరిసింది
హిందీతో పాటు దక్షిణాదివైపు కూడా తొంగి చూసింది. తెలుగులో మహేష్బాబు సరసన 'టక్కరి దొంగ' సినిమాలో నటించింది. అలాగే తమిళంలోనూ అడుగుపెట్టింది. విజయ్ సరసన 'సచిన్' అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం అంతగా ఆదరణ పొందలేదు. వీటి తరువాత చాలా రోజులు ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించలేదు. బాలీవుడ్ సినిమాల్లో బిజీ కావడమే అందకు కారణం. ఆ సమయంలో రితూ పర్ణోఘోష్ చెప్పిన కథ నచ్చడంతో పాటు, తన సొంత భాష బెంగాలీ నటించాలనే కోరికతో 'శోభ చరిత్రో కల్పోనిక్' అనే చిత్రంలో నటించింది. ఎప్పుడూ కురచ దస్తులతో కనిపించే బిపాసా.. ఇందులో మాత్రం నిండైన వస్త్రాలంకరణతో అలరించింది. ఆ పాత్రలో చాలా మంది బిపాసా..షబనా అజ్మీని మరిపించిందని మెచ్చుకొన్నారు.
ఆల్బమ్స్ అదరహో..
బిపాసా కేవలం సినిమాలతోనే సరిపెట్టుకోలేదు. పలు ఆల్బమ్స్లలో కూడా ఆడిపాడింది. ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్కి చెందిన 'కిస్మత్' అనే ఆల్బమ్స్లో బిపాసా కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అలాగే జేసియాన్కి చెందిన 'స్టోలెన్' అనే వీడియో ఆల్బమ్స్లోనూ అతిథిగా అలరించింది. స్వతహాగా ఫిట్నెస్కి ప్రాధాన్యమిచ్చే బిపాసా అందుకు సంబంధించిన విషయాలతో..'లవ్ యువర్ సెల్ఫ్' అనే ఓ వీడియోని విడుదల చేసింది. ఇందులో బిపాసా భంగిమలు చూడటానికి కుర్రకారు ఎంతో ఉత్సాహం చూపించారు. డీవీడీలను తీసుకొని దాచుకున్నారు. అలాగే జాన్ అబ్రహామ్తో కలిసి 'బాలీవుడ్ బాడీస్' అనే మరొక వీడియో ఆల్బమ్లో నటించింది. అది కూడా ఫిట్నెస్ నేపథ్యంలో తెరకెక్కిందే.
ప్రేమాయణం
సినిమాలతోనే కాకుండా... వ్యక్తిగత విషయాలతోనూ తరుచు వార్తలో నిలిచింది బిపాసా. ఆమె పలుమార్లు ప్రేమలో పడింది. 'రాజ్' చిత్రంతో తనతో కలిసి తెరను పంచుకొన్న డినోమోరియాతో తొలుత ప్రేమలో పడింది బిపాసా. వారిద్దరూ మూడు నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఆ తరువాత 'జిస్మ్' కోసమని జాన్ అబ్రహామ్తో కలిసి నటించింది. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఎనిమిదేళ్లు వీరి మధ్య బంధం కొనసాగింది. సూపర్ కపుల్గా బాలీవుడ్ని ఆకర్షించింది ఈ జంట. త్వరలోనే పెళ్లితో ఒక్కటవ్వబోతుందని ప్రచారం సాగింది. అయితే చిత్రంగా 2011లో వీళ్లు బ్రేకప్ చెప్పుకొన్నారు. బిపాసా ఒంçటరైంది. మళ్లీ తన సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ తరువాత నటుడు షాహిద్ కపూర్తో డేటింగ్ చేసిందని చెప్పుకున్నారు.
ప్రతినాయికగా..
అమెరికన్ చిత్రం 'కన్సెటింగ్ అడల్ట్స్' చిత్రంలో బిపాసా ఓ ప్రతినాయిక పాత్రలో మెరిసింది. ఆ పాత్ర పోషించిన బిపాసాకు మంచి ప్రశంసలు దక్కాయి. తొలి చిత్రంతోనే ఉత్తమ నటనను కనబరించిందని విమర్శకులు మెచ్చుకొన్నారు. ఇవే కాకుండా పలు చిత్రాలకు ఉత్తమ నటి అవార్డ్సును అందకుంది. వాటిలో 'కార్పోరేట్', 'రాజ్', 'జిస్మ్'లాంటి చిత్రాలు ఉన్నాయి.
ప్రస్తుతం
భర్త కరణ్సింగ్ గ్రోవర్తో కలిసి జీవిస్తున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఎక్కువ శాతం భర్తతో కలిసి వీదేశాలు చుట్టొస్తుంది. 'మీటూ' ఉద్యమంలో భాగంగా తను సినిమాల్లో చేస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు వెల్లడించింది. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ఖాన్ దర్శకత్వంలో 'హమ్షకల్స్'లో (2014)లో నటించినప్పుడు అతను చేష్టలు చాలా త్రీవంగా ఉన్నాయంటూ చెప్పకొచ్చింది బిపాసా.
ఇదీ చదవండి:బిగ్ బీ లద్దాఖ్ పర్యటన- నెటిజన్ల ఆవేదన!