'ద మ్యాట్రిక్స్' సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. 1999 నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలై.. దాదాపు 1.6 బిలియన్ డాలర్లకు(రూ. 11వేల కోట్లు) పైగా వసూళ్లు సాధించాయి. త్వరలో నాలుగో భాగం పట్టాలెక్కనున్నట్లు నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ అధికారికంగా వెల్లడించింది. ప్రముఖ నటీనటులు కీను రీవ్స్, కారీ అన్నేమోస్... నియో, ట్రినిటీ పాత్రల్లో కనువిందు చేయనున్నారు.
మెుదటి మూడు చిత్రాలు తీసిన ప్రముఖ దర్శక ద్వయం 'లానా-లిల్లీ వాచౌస్కీ' నాలుగో భాగం తెరకెక్కించనుంది.
"20వేల సంవత్సరాలు క్రితం అనుకున్న ఐడియా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది. వాటిని మరోసారి సినిమాలో చూపించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితులతో కలిసి పనిచేయటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా".
-- లానా వాచౌస్కీ, దర్శకురాలు
ఈ సినిమాకు లానా వాచౌస్కీ కథ అందించనుంది. ఆమెకు అలెగ్జాండర్ హేమన్, డేవిడ్ మిచెల్ సహాయం చేయనున్నారు.
వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, విలేజ్ రోడ్షో పిక్చర్స్ సంయుక్తంగా సినిమా నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభంకానుంది.
20 ఏళ్ల వేడుకలు...
'ద మ్యాట్రిక్స్' సిరీస్ తొలి పార్టు విడుదలై ఈ ఏడాది మార్చి 31 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆగస్ట్ 30నుంచి అమెరికావ్యాప్తంగా ఏఎమ్సీ థియేటర్లలో వేడుకలు జరపనున్నారు.
మ్యాట్రిక్స్... ఓ కృత్రిమ ప్రపంచం
మనుషులు రూపొందించిన రోబోలు భవిష్యత్తులో కృత్రిమ మేధస్సుతో విజృంభించి తిరగబడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో వచ్చిందే ఈ సినిమా. భవిష్యత్తులో రోబోలు మనుషులపై యుద్ధం ప్రకటిస్తే... మానవులంతా కలిసి వాటికి అత్యంత అవసరమైన సోలార్ ఎనర్జీని అందకుండా చేస్తారు. కానీ అవి మానవ శరీరంలో ఉండే బయో ఎలక్ట్రిక్ పవర్నే ఉపయోగించుకుంటూ మనుషుల మైండ్స్ను వశపరుచుకుంటాయి. ఆ విధంగా మనుషులు రోబోలుగా మారిపోతారన్నమాట. అలా మారిన మానవ రోబోలను తిరిగి మామూలుగా మార్చడానికి కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వారిని రోబోలు ఎలా ఎదుర్కొన్నాయి.? మనుషులు, మానవ రోబోల మధ్య పోరాటాలు ఎలా సాగాయనే యాక్షన్ సన్నివేశాలను 'ద మ్యాట్రిక్స్' సిరీస్లో అద్భుతమైన గ్రాఫిక్స్తో చూపించారు.
ఇదీ చూడండి: 'నో టైమ్ టు డై' అంటున్న బాండ్