సంజయ్ లీలా భన్సాలీకి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా బాలీవుడ్లో మంచి పేరుంది. అదే విధంగా కథానాయికగా దీపికా పదుకొణె కూడా తాను ఎంచుకొనే పాత్రల్లో వైవిధ్యతను కనబరుస్తుంది. ప్రస్తుతం సంజయ్ 'గంగూబాయి కతియావాడి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. హుస్సేన్ జైదీ రచించిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై'లోని 'మేడమ్ ఆఫ్ కామతిపుర' ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది.
ఈ సినిమా తర్వాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'బైజు బావ్రా' అనే సినిమాను రూపొందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో డెకాయిట్ రూపమతి అనే పాత్రను నటి దీపికా పదుకొణె పోషించనున్నారట. ఈ పాత్ర కోసం ఇప్పటికే సంజయ్ - దీపికాతో కలిసి పలుమార్లు చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ఇంకా కొన్ని విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయట. చిత్రానికి సంబంధించి స్క్రిప్టు కూడా ఇంకా పూర్తి కాలేదని.. 2022 నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమాలోని ఇతర నటీనటుల కోసం దర్శకుడు సంప్రదింపులు జరిపే పనిలో ఉన్నారట. సినిమాకు సంబంధించి అన్ని హంగులు సమకూరగానే సంజయ్ అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి 'గోలియో కి రాస్లీలా రామ్ లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్' లాంటి బ్లాక్ బస్టర్లను ప్రేక్షకులకు అందించారు. అందుకే 'బైజు బావ్రా' సినిమా గురించి కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం దీపికా పదుకొణె తన భర్తతో రణ్వీర్ సింగ్తో కలిసి '83'లో నటించింది. జూన్ 4న సినిమా విడుదల కానుంది. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పఠాన్'లో కథానాయికగా నటిస్తుంది. ఇక తెలుగులో నాగ్అశ్విన్ దర్శత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది.
ఇదీ చూడండి: ఈ బీటౌన్ తారల సంపాదన ఎంతో తెలుసా?