కొత్త నిబంధనలతో యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లదని మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరోసారి స్పష్టం చేసింది. కొత్త పాలసీపై యూజర్లలో తలెత్తిన గందరగోళం నేపథ్యంలో మంగళవారం ఈ వివరణ ఇచ్చింది.
కాంటాక్ట్ లిస్ట్, గ్రూప్ల డేటాను ప్రకటనల కోసం మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకోబోమని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ చాటింగ్లను చదవటం, కాల్స్ను వినటం వంటివి చేయమని పేర్కొంది. మెసేజ్లు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ విధానంలో భద్రంగా ఉంటాయి కాబట్టి వాటిని తాము చూడలేమని గుర్తు చేసింది.
వాట్సాప్లో వ్యాపారాలకు సంబంధించి మాత్రమే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా డేటాను ఎలా సేకరిస్తాం, ఎలా వినియోగించుకుంటామనే విషయంపై పారదర్శకంగా ఉండేందుకే నిబంధనల్లో మార్పులు చేసినట్లు వివరించింది.
వాట్సాప్ వివరణ ఎందుకంటే..
కొత్త పాలసీకి సంబంధించి.. వాట్సాప్ గత వారం ప్రకటన చేసింది. ఫిబ్రవరి 8లోపు యూజర్లు ఈ నిబంధనలను అంగీకరించాలని తెలిపింది. లేదంటే వాట్సాప్ను వాడేందుకు వీలుండదని స్పష్టం చేసింది.
ఈ ఒక్క ప్రకటనతో సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్పై పెద్ద ఎత్తున విమర్శలు, మీమ్స్ మొదలయ్యాయి. ఫేస్బుక్తో తమ సమాచారం పంచుకుంటుందనే కారణంతో చాలా మంది యూజర్లు ఇప్పటికే టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్లను వాడటం మొదలు పెట్టారు.
యూజర్ల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందనే పుకార్లకు అడ్డుకట్ట వేసేందుకు.. తమ నూతన పాలసీలపై మరోసారి స్పష్టత ఇస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది.
ఇదీ చూడండి:వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్... ఏది సేఫ్?