ప్రపంచంలోని ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీల్లో జినోవ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న భారతీయ కంపెనీలు, నిపుణులకు ఏడాదికోసారి అవార్డులు ప్రకటిస్తుంది. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఈ పురస్కారాన్ని ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు. దీంట్లో వ్యక్తిగత విభాగంలో టెక్నికల్ రోల్మోడల్గా ఎంపికయ్యాడు సునీల్. ఇది మామూలు విషయమేం కాదు. ప్రతిభ, సామర్థ్యం, నాయకత్వ లక్షణాల ఆధారంగా సంస్థ తమ ఉద్యోగి ఒకరిని ముందు దీనికి నామినేట్ చేస్తుంది.
సునీల్ ప్రస్తుతం డేటా సైన్స్ డైరెక్టర్గా ఉన్న ఎరిక్సన్ కంపెనీలో ఆరు వందలమంది ఉద్యోగులున్నారు. అందులో డేటా సైన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీలో అతడ్ని రోల్మోడల్గా భావించి ఎంపిక చేసింది. ఇలా ఇంటెల్, డెల్, శామ్సంగ్, క్వాల్కామ్, ఐబీఎం..లాంటి వందల కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తుల్లోంచి వడపోతల అనంతరం తుది విజేతను ఎంపిక చేశారు. న్యాయనిర్ణేతల్లో ఎక్కువమంది వివిధ కంపెనీల అధిపతులే. నామినేట్ అయిన ఉద్యోగి చేసిన పరిశోధన కంపెనీకి ఎంత ఉపయోగకరంగా ఉంది, వచ్చిన పేటెంట్లు, రాసిన పరిశోధక వ్యాసాలు, రెవెన్యూపై చూపిస్తున్న ప్రభావం.. ఈ వివరాలన్నీ పరిశీలించాక విజేతను ఎంపిక చేశారు.
ఆ రోజుల్లోనే..
కృష్ణాజిల్లాలోని నాగాయలంక అనే పల్లెటూరిలో పుట్టిపెరిగిన సునీల్ ఈ స్థాయికి చేరడం వెనక ఎంతో పట్టుదల ఉంది. వాళ్ల నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కొడుకు బిట్స్ పిలానీలో చదవాలని ఆయన కోరిక. దానికి తగ్గట్టే సునీల్ చదువుల్లో మెరిట్ విద్యార్థి. కానీ కొద్దిలో కోరుకున్న సీటు రాలేదు. విజయవాడలో యూనివర్సిటీ ర్యాంక్తో బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత ఐఐటీ-రూర్కీలో ఎంటెక్. ఎక్స్చేంజ్ స్కాలర్ ప్రోగ్రాం కింద ఆస్ట్రేలియాలో చదువుతున్నప్పుడే ప్రాంగణ నియామకాల్లో ఒరాకిల్ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అప్లికేషన్స్ ఇంజినీర్గా రెండేళ్లు అక్కడ పని చేసినా ఏదో అసంతృప్తి. ఏదైనా పరిశోధన చేసి తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నాడు. బెంగళూరులోని ఇన్ఫోసిస్ ఆర్ అండ్ డీలో చేరగానే ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. అక్కడ పదేళ్లు పని చేశాడు. అక్కడే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై పట్టు సాధించాడు. ఆ కొత్తలోనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైంది. సెన్సింగ్, యాక్టివేషన్ ద్వారా ప్రోగ్రామ్స్ రూపొందించేవాడు. ఇల్లు, ఆఫీసు ఉష్ణోగ్రతల్ని అదుపులో ఉంచడం.. ఇంట్లోకి రాగానే ఆటోమేటిగ్గా లైట్లు వెలగడం, బయటికెళ్లిపోగానే ఆఫ్ కావడం.. ఇలాంటివన్నీ.
ముందుండి నడిపిస్తూ
ఏఐ మీద మరింత పట్టు సాధించడానికి బెంగళూరులోని ట్రిపుల్ ఐటీలో ఆప్టిమైజేషన్ టెక్నాలజీలో పీహెచ్డీ చేయాలనుకున్నాడు. అది తనకి ఇష్టమైన సబ్జెక్టు. మరోవైపు తీరిక లేని పని. సమయం వృథా కాకూడదని కొన్నిసార్లు రాత్రిళ్లు ఆఫీసులోనే పడుకునేవాడు. ఈ సమయంలోనే ఇన్ఫోసిస్లో యాజమాన్య మార్పు జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్లాట్ఫాం, ప్రొడక్ట్ టీం ప్రారంభించారు. ఈ సమయంలో కొత్త బృందాలకు మార్గనిర్దేశం చేశాడు. అమెరికా, ఇంగ్లండ్లలో విస్తరించిన శాఖలకు నాయకత్వం వహించాడు. ఏఐలో మంచి నిపుణుడిగా పేరు రావడంతో ఫిలిప్స్ రీసెర్చ్ సంస్థ నుంచి పిలుపొచ్చింది. ప్రిన్సిపల్ సైంటిస్ట్గా వెళ్లాడు. అక్కడ ఏఐ బేస్డ్ హెల్త్కేర్ సిస్టమ్ రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇదేసమయంలో ఐఐఎం-అహ్మదాబాద్లో సీనియర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశాడు. రెండేళ్ల కిందట ఎరిక్సన్లో గ్లోబల్ ఏఐ యాక్సిలరేటర్ అనే కార్యక్రమం ప్రారంభించారు. దీనికి నాయకత్వం వహించమంటూ ఆహ్వానం అందడంతో డేటా సైన్స్ డైరెక్టర్ హోదాతో వెళ్లాడు. నాన్న టీచరు కావడంతో సునీల్కి చిన్నప్పట్నుంచి బోధనపై మమకారం. ఎంచుకున్న రంగంలో ఎప్పటికప్పుడు ఎదుగుతూనే, కృత్రిమ మేధస్సులో కీలక పరిశోధనలు చేస్తూనే వారాంతాల్లో, సెలవుల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, త్రిబుల్ఐటీలాంటి ప్రముఖ విద్యాసంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో విద్యాసంస్థల్లో గెస్ట్ లెక్చర్లు ఇస్తున్నాడు.
ప్రయత్న లోపం లేకుండా కష్టపడి పని చేస్తే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మనం కోరుకున్న దానికన్నా ఎక్కువే అందుకుంటాం. మా నాన్న మొదట్నుంచీ చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. మాకోసం, ఖర్చులు తగ్గించుకోవడానికి వాహనం కొనగలిగే స్తోమత ఉన్నా కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకి సైకిల్పై వెళ్లి వచ్చేవారు. ఆయన ఆశయం నెరవేర్చి మంచి స్థానంలో ఉండాలనుకున్నా. నేను మెరిట్ విద్యార్థినైనా ఇంగ్లిష్లో కాస్త మార్కులు తక్కువ రావడంతో నాన్న అనుకున్నట్టుగా బిట్స్ పిలానీలో సీటు సాధించలేకపోయా. కానీ తర్వాత ఐఐటీ, ఐఐఎంలలో చదివా. ఏఐని ఎంచుకొని మనసు పెట్టి పని చేశా. నైపుణ్యాలు పెంచుకోవడానికి అనుక్షణం తపించా. నన్ను వెతుక్కుంటూ మంచి ఉద్యోగాలు వచ్చాయి. అభిరుచి ఉన్న రంగాన్ని ఎంచుకొని కష్టపడితే ఎవరైనా విజేతలవుతారు.
* 2019లో అనలిటిక్స్ మేగజైన్ సునీల్ని దేశంలోని టాప్ టెన్ డేటా సైంటిస్టుల్లో ఒకరిగా ఎంపిక చేసింది.
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధస్సు అంశంపై అతడి పేరు మీద 25 పేటెంట్స్ ఉన్నాయి.
* 30 పరిశోధక వ్యాసాలు ప్రముఖ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. వీటిలో రెండింటికి బెస్ట్ పేపర్ అవార్డులు వచ్చాయి.
* ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సంస్థల్లో ఒకటైన ఐఈఈఈలో బెంగళూరు సెక్షన్కి కో-ఛైర్. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య వారధిగా పని చేస్తూ వర్క్షాప్లు నిర్వహిస్తున్నాడు.