విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది. దాన్ని నివారించేందుకు ఓ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్లో 'ప్రింట్ స్పూలర్' ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున వారు ఆన్లైన్లో ప్రచురించారు.
వెంటనే డిలీట్ చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్ సైట్లలోకి సదరు సమాచారం చేరింది. 'ప్రింట్నైట్మేర్'గా పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్లను ఇతరుల కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసే ముప్పుందని; డేటాను చూడటం, డిలీట్ చేయడం, కొత్త యూజర్ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకూ పాల్పడే అవకాశముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఫలితంగా కంప్యూటర్లపై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ వస్తుందని పేర్కొంది. విండోస్-10తో పాటు విండోస్-7లోనూ ఈ లోపం ఉందని తెలిపింది. వాటికోసం అప్డేట్లను విడుదల చేసింది. ఇంతకుముందు బయటపడ్డ లోపాలనూ అధిగమించేలా తాజా అప్డేట్లను సమగ్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపింది. వాస్తవానికి విండోస్-7కు తమ సపోర్ట్ను మైక్రోసాఫ్ట్ గత ఏడాదే ముగించింది. అయితే- ప్రింట్నైట్మేర్ తీవ్రత దృష్ట్యా మళ్లీ ఆ వర్షన్కు కూడా అప్డేట్ను అందించింది.
ఇదీ చూడండి: మైక్రోసాఫ్ట్ విండోస్ 11 వచ్చేసింది!