ETV Bharat / opinion

ఇచ్చేయ్​ రాజీనామా.. పట్టేయ్​ పదవి!

author img

By

Published : Jul 7, 2020, 6:38 AM IST

ఎన్నికల్లో గెలిచిన వారికే పదవులన్నది పాతమాట. గెలిచి రాజీనామా చేసినవారికే పీఠాలన్నది కొత్తపాట. అవును.. మధ్యప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో ఇదే జరిగింది. ఎన్నికల్లో ఎవరు ఏ గుర్తు మీద గెలిస్తేనేం, రాజీనామా చేసి సొంత ప్రభుత్వాన్ని కూల్చేసి మన పక్షంలో చేరిపోతే చాలన్నది వీరి విజయసూత్రం. ప్రజాసేవే పరమార్థంగా... సర్వమానవ సంక్షేమమే లక్ష్యంగా సాగే ఈ పరమపద పదవీ సోపానాన్ని కనులారా దర్శించిన వారి జన్మ చరితార్థమైపోతుంది.

MADHYA PRADESH MINISTRY POSTS
పదవికి దారి

మొన్న ఆయన ఎమ్మెల్యే. నిన్న రాజీనామా చేసిన శాసనసభ్యుడు. నేడు గౌరవ మంత్రివర్యులు! మొన్నటికి ఇవాళ్టికి మధ్య జరిగిన జగన్నాటకం- కాబోయే నాయకులకు ఓ గొప్ప పాఠం. ఎన్నికల్లో గెలిచిన వారికే పదవులన్నది పాతమాట. గెలిచి రాజీనామా చేసినవారికే పీఠాలన్నది కొత్తపాట. మధ్యప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో విస్తరి దక్కించుకున్న ద్వాదశ ధర్మపరిరక్షణా దురంధురుల సాక్షిగా ఇదే ఈనాటి రాజకీయం. హవ్వ! ఇదెక్కడి విడ్డూరమని బుగ్గలు నొక్కుకోకండి. కరోనా కాలపు కుళ్లు రాజకీయాలని అప్పుడే మెటికలు విరవకండి.

పదిమంది నడిచిందే బాట, పలికిందే మాట అని మన పెద్దలు ఊరికే చెప్పారా! మరి పదిమందేం ఖర్మ- పన్నెండు మంది ‘పెదవే పలికిన మాటల్లోన తియ్యనిమాటే పదవీ... సంపదలిచ్చే దేవత పదవీ’ అని అమితానందంతో పాడుకుంటూ నడచిపోయిన ఆ అడ్డదారే కదా దేశ ప్రగతికి దగ్గరిదారి. కాబట్టి మిత్రులారా! అఖిల భారత నిఖిల నేతలందరికీ వినపడేలా ఓమారు గట్టిగా నినదిద్దాం- హై హై నాయకా... ఇచ్చేయ్‌ రాజీనామా ఇక! పట్టేయ్‌ పదవి చకచకా! చేసేయ్‌ ప్రజాసేవ ఎంచక్కా!

శత్రు పక్షంలో..

చిన్న పదవిని త్యాగం చేసి పెద్ద పదవిని సంపాదించుకున్న డజను మందికి దళపతి... శ్రీమాన్‌ జ్యోతిరాదిత్య సింధియా మహారాజులుం గారు! సొంత పార్టీతో ఆయనకేదో లెక్కల్లో తేడా వచ్చింది... అలకపాన్పు ఎక్కేశారు. పక్కపార్టీ పెద్దలొచ్చి ఓదార్చారు. అన్నంపెట్టని అమ్మకంటే బిర్యానీ వడ్డిస్తానంటున్న అత్తమ్మే మేలనుకున్నారీ గ్వాలియర్‌ ప్రభువులు! ‘రాజు వెడలె రవితేజములలరగ...’ అన్నట్టు బయలుదేరి వైరిపక్షంలో చేరిపోయారు. నాయకుడికి నమ్మినబంట్లుగా ఆ పన్నెండు మందికీ ‘కమలనాథు’డి మీద కోపం, కమలం మీద ప్రేమ ఏకకాలంలో తన్నుకొచ్చాయి. ‘హస్తం గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవులు మాకెందుకు... ఛీ ఛీ’ అనుకుని త్యాగం చేసేశారు. అంతే! పాత ప్రభుత్వం పేకమేడయ్యింది.

అప్పుడు మాజీ.. ఇప్పుడు కొత్త మంత్రి

మాజీ శాసనసభ్యులు కాస్తా కొలువుదీరిన కొత్త సర్కారులో తాజా మంత్రులైపోయారు. ఇందులో ‘నాకిది- నీకిది’ అన్న వక్రగతిని కాంచినవారి కళ్లుపోతాయ్‌! ‘వాళ్లు త్యాగులయ్యా... చిదానంద భోగులయ్యా!’ అన్న వంధిమాగధ గణపు స్తుతిగీతాలే సకల రాజకీయులకు దారిదీపాలు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సృజనాత్మక పద్ధతిని కనిపెట్టిన ఈ పుణ్యాత్ములకు ‘రాజకీయ నోబెల్‌’ ఇవ్వాలన్నది అభిమానుల డిమాండ్‌! ‘నిరుపమాన నవనవోన్మేష నిర్లజ్జా రాజకీయ చరిత్ర’ గ్రంథంలోని ‘నేతిబీర న్యాయం’ ప్రకారం వీళ్లకు ఆ బహుమతి ఇచ్చి తీరాల్సిందే.

పదవి లేకుండా ప్రజాసేవ..

అవకాశవాద రాజకీయాలకు మంగళకరం మధ్యప్రదేశమని (బహుశా పేరుబలం కావచ్చు! ‘మధ్య’ అంటే ‘అవకాశ’మనే ద్వంద్వార్థమూ ఉంది మరి!) గిట్టనివాళ్లు ఎకసెక్కాలాడుతున్నారు. కానీ, అక్కడి నేతల నిస్వార్థ హృదయాల్లోకి పాపం ఎవరూ తొంగి చూడట్లేదు. పదవి లేకుండా ప్రజాసేవ చేయడమంటే ఉప్మా లేని పెసరట్టును తినడం లాంటిదే! ఎవరికి మాత్రం ఆ రాజకీయం రుచిస్తుంది చెప్పండి! ‘పదవి ఎంత మధురం... పార్టీ అంత కఠినం’ అని విలపిస్తున్న వైరిపక్షీయులను గుర్తించి, వారి కడుపుమంటలను ఎగదోసి తాము చలి కాచుకోవడమే ఇప్పటి రాజకీయాల్లో బతకనేర్చినతనం. ఈ విద్యలో పరిశోధక పట్టాలందుకున్న వారి మార్గదర్శకత్వంలో మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి. వీరి వైభవాన్ని చూసి ఓర్చుకోలేని వారే నైతిక విలువలూ నాపరాతి బండలంటూ పాచిపోయిన చపాతీ కబుర్లు చెబుతుంటారు!

ప్రభుత్వాన్ని కూల్చేసి..

తాటిచెట్టు ఎందుకు ఎక్కావయ్యా పెద్దమనిషీ! అంటే దూడగడ్డి కోసం అన్నాట్ట వెనకటికో మహానుభావుడు. పార్టీ ఎందుకు మారావు మహాప్రభూ అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమనే నాయకులందరూ ఆ పెద్దయ్య శిష్యులే. తాడిదన్నే వాడుంటే వాడి తలదన్నే వాడు ఇంకొకడు ఉంటాడన్నట్టు తాతల్లాంటి ఈ నేతలకే దగ్గులు నేర్పగల కొత్త రాజకీయాచార్యులు అవతరించారు. ఆవెక్కడ మేస్తేనేం మన ఇంట్లో పాలిస్తే చాలనుకునే లౌక్యం వీరిది. ఎన్నికల్లో ఎవరు ఏ గుర్తు మీద గెలిస్తేనేం, రాజీనామా చేసి సొంత ప్రభుత్వాన్ని కూల్చేసి మన పక్షంలో చేరిపోతే చాలన్నది వీరి విజయసూత్రం. ప్రజాసేవే పరమార్థంగా... సర్వమానవ సంక్షేమమే లక్ష్యంగా సాగే ఈ పరమపద పదవీ సోపానాన్ని కనులారా దర్శించిన వారి జన్మ చరితార్థమైపోతుంది.

ఔత్సాహిక రాజకీయులూ... మీకు పాఠం పూర్తయిపోయింది. ప్రాక్టికల్స్‌ కోసం మధ్యప్రదేశ్‌ మహాత్ములను సంప్రదించండి!

- శైలేష్‌ నిమ్మగడ్డ, రచయిత

ఇదీ చదవండి: ఈ నెల్లోనే మైలాన్‌ రెమ్‌డెసివిర్‌- ధర ఎంతంటే?

మొన్న ఆయన ఎమ్మెల్యే. నిన్న రాజీనామా చేసిన శాసనసభ్యుడు. నేడు గౌరవ మంత్రివర్యులు! మొన్నటికి ఇవాళ్టికి మధ్య జరిగిన జగన్నాటకం- కాబోయే నాయకులకు ఓ గొప్ప పాఠం. ఎన్నికల్లో గెలిచిన వారికే పదవులన్నది పాతమాట. గెలిచి రాజీనామా చేసినవారికే పీఠాలన్నది కొత్తపాట. మధ్యప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో విస్తరి దక్కించుకున్న ద్వాదశ ధర్మపరిరక్షణా దురంధురుల సాక్షిగా ఇదే ఈనాటి రాజకీయం. హవ్వ! ఇదెక్కడి విడ్డూరమని బుగ్గలు నొక్కుకోకండి. కరోనా కాలపు కుళ్లు రాజకీయాలని అప్పుడే మెటికలు విరవకండి.

పదిమంది నడిచిందే బాట, పలికిందే మాట అని మన పెద్దలు ఊరికే చెప్పారా! మరి పదిమందేం ఖర్మ- పన్నెండు మంది ‘పెదవే పలికిన మాటల్లోన తియ్యనిమాటే పదవీ... సంపదలిచ్చే దేవత పదవీ’ అని అమితానందంతో పాడుకుంటూ నడచిపోయిన ఆ అడ్డదారే కదా దేశ ప్రగతికి దగ్గరిదారి. కాబట్టి మిత్రులారా! అఖిల భారత నిఖిల నేతలందరికీ వినపడేలా ఓమారు గట్టిగా నినదిద్దాం- హై హై నాయకా... ఇచ్చేయ్‌ రాజీనామా ఇక! పట్టేయ్‌ పదవి చకచకా! చేసేయ్‌ ప్రజాసేవ ఎంచక్కా!

శత్రు పక్షంలో..

చిన్న పదవిని త్యాగం చేసి పెద్ద పదవిని సంపాదించుకున్న డజను మందికి దళపతి... శ్రీమాన్‌ జ్యోతిరాదిత్య సింధియా మహారాజులుం గారు! సొంత పార్టీతో ఆయనకేదో లెక్కల్లో తేడా వచ్చింది... అలకపాన్పు ఎక్కేశారు. పక్కపార్టీ పెద్దలొచ్చి ఓదార్చారు. అన్నంపెట్టని అమ్మకంటే బిర్యానీ వడ్డిస్తానంటున్న అత్తమ్మే మేలనుకున్నారీ గ్వాలియర్‌ ప్రభువులు! ‘రాజు వెడలె రవితేజములలరగ...’ అన్నట్టు బయలుదేరి వైరిపక్షంలో చేరిపోయారు. నాయకుడికి నమ్మినబంట్లుగా ఆ పన్నెండు మందికీ ‘కమలనాథు’డి మీద కోపం, కమలం మీద ప్రేమ ఏకకాలంలో తన్నుకొచ్చాయి. ‘హస్తం గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవులు మాకెందుకు... ఛీ ఛీ’ అనుకుని త్యాగం చేసేశారు. అంతే! పాత ప్రభుత్వం పేకమేడయ్యింది.

అప్పుడు మాజీ.. ఇప్పుడు కొత్త మంత్రి

మాజీ శాసనసభ్యులు కాస్తా కొలువుదీరిన కొత్త సర్కారులో తాజా మంత్రులైపోయారు. ఇందులో ‘నాకిది- నీకిది’ అన్న వక్రగతిని కాంచినవారి కళ్లుపోతాయ్‌! ‘వాళ్లు త్యాగులయ్యా... చిదానంద భోగులయ్యా!’ అన్న వంధిమాగధ గణపు స్తుతిగీతాలే సకల రాజకీయులకు దారిదీపాలు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సృజనాత్మక పద్ధతిని కనిపెట్టిన ఈ పుణ్యాత్ములకు ‘రాజకీయ నోబెల్‌’ ఇవ్వాలన్నది అభిమానుల డిమాండ్‌! ‘నిరుపమాన నవనవోన్మేష నిర్లజ్జా రాజకీయ చరిత్ర’ గ్రంథంలోని ‘నేతిబీర న్యాయం’ ప్రకారం వీళ్లకు ఆ బహుమతి ఇచ్చి తీరాల్సిందే.

పదవి లేకుండా ప్రజాసేవ..

అవకాశవాద రాజకీయాలకు మంగళకరం మధ్యప్రదేశమని (బహుశా పేరుబలం కావచ్చు! ‘మధ్య’ అంటే ‘అవకాశ’మనే ద్వంద్వార్థమూ ఉంది మరి!) గిట్టనివాళ్లు ఎకసెక్కాలాడుతున్నారు. కానీ, అక్కడి నేతల నిస్వార్థ హృదయాల్లోకి పాపం ఎవరూ తొంగి చూడట్లేదు. పదవి లేకుండా ప్రజాసేవ చేయడమంటే ఉప్మా లేని పెసరట్టును తినడం లాంటిదే! ఎవరికి మాత్రం ఆ రాజకీయం రుచిస్తుంది చెప్పండి! ‘పదవి ఎంత మధురం... పార్టీ అంత కఠినం’ అని విలపిస్తున్న వైరిపక్షీయులను గుర్తించి, వారి కడుపుమంటలను ఎగదోసి తాము చలి కాచుకోవడమే ఇప్పటి రాజకీయాల్లో బతకనేర్చినతనం. ఈ విద్యలో పరిశోధక పట్టాలందుకున్న వారి మార్గదర్శకత్వంలో మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి. వీరి వైభవాన్ని చూసి ఓర్చుకోలేని వారే నైతిక విలువలూ నాపరాతి బండలంటూ పాచిపోయిన చపాతీ కబుర్లు చెబుతుంటారు!

ప్రభుత్వాన్ని కూల్చేసి..

తాటిచెట్టు ఎందుకు ఎక్కావయ్యా పెద్దమనిషీ! అంటే దూడగడ్డి కోసం అన్నాట్ట వెనకటికో మహానుభావుడు. పార్టీ ఎందుకు మారావు మహాప్రభూ అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమనే నాయకులందరూ ఆ పెద్దయ్య శిష్యులే. తాడిదన్నే వాడుంటే వాడి తలదన్నే వాడు ఇంకొకడు ఉంటాడన్నట్టు తాతల్లాంటి ఈ నేతలకే దగ్గులు నేర్పగల కొత్త రాజకీయాచార్యులు అవతరించారు. ఆవెక్కడ మేస్తేనేం మన ఇంట్లో పాలిస్తే చాలనుకునే లౌక్యం వీరిది. ఎన్నికల్లో ఎవరు ఏ గుర్తు మీద గెలిస్తేనేం, రాజీనామా చేసి సొంత ప్రభుత్వాన్ని కూల్చేసి మన పక్షంలో చేరిపోతే చాలన్నది వీరి విజయసూత్రం. ప్రజాసేవే పరమార్థంగా... సర్వమానవ సంక్షేమమే లక్ష్యంగా సాగే ఈ పరమపద పదవీ సోపానాన్ని కనులారా దర్శించిన వారి జన్మ చరితార్థమైపోతుంది.

ఔత్సాహిక రాజకీయులూ... మీకు పాఠం పూర్తయిపోయింది. ప్రాక్టికల్స్‌ కోసం మధ్యప్రదేశ్‌ మహాత్ములను సంప్రదించండి!

- శైలేష్‌ నిమ్మగడ్డ, రచయిత

ఇదీ చదవండి: ఈ నెల్లోనే మైలాన్‌ రెమ్‌డెసివిర్‌- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.