కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం దేశం ముందున్న పెద్ద సవాలు. ఆర్ధికాభివృద్ధిలో భూమి హక్కులు, రికార్డుల పాత్ర ఎనలేనిది. ఈ విషయాన్ని గుర్తించి మెరుగైన చర్యలు చేపడితే ప్రగతి మరింత వేగం పుంజుకొంటుంది. 'భూమి పెట్టుబడిగా మారితేనే సంపద సృష్టి జరుగుతుంది, భూరికార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా దేశాల్లో భూమి మృత పెట్టుబడిగానే ఉండిపోయింది, లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపదగా మారకపోవడం వల్ల చాలా దేశాల్లో ఆర్ధిక ప్రగతి కుంటువడింది' అని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త హెర్నాండో డిసోటో స్పష్టంచేశారు. భూమిపై యాజమాన్య హక్కుల గుర్తింపు, భూహక్కులకు ప్రభుత్వ హామీ, స్పష్టమైన, భద్రమైన భూరికార్డుల నిర్వహణ కలిగి ఉన్న దేశాలు మెరుగైన ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నాయి. మన దేశంలో రికార్డుల నిర్వహణ ఆశించిన మేరకు లేదని ఇటీవల జాతీయ ఆర్థిక పరిశోధన మండలి అధ్యయనం స్పష్టం చేసింది. భూరికార్డులు సరిచేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని అభిప్రాయపడింది.
క్రమంగా అడుగులు
భూమిపై హక్కులు స్పష్టంగా లేకపోవడం, భూరికార్డులు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించక పోవడం కారణంగా దేశం ఏటా జాతీయ ఆదాయ వృద్ధిలో 1.3 శాతం కోల్పోతున్నట్లు మెకంజీ సంస్థ రెండు దశాబ్దాల క్రితమే పేర్కొంది. దాదాపు తొంబై శాతం భూములకు ఏదో ఒక సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ కొవిడ్ నేపథ్యంలో దేశంలో అభివృద్ధి, ఉద్యోగ కల్పన కోసం తీసుకోవాల్సిన చర్యలపై గత ఏడాది ఇచ్చిన నివేదికలోనూ ఆర్థ్దికాభివృద్ధికి భూరికార్డుల సరళీకరణ, ఆధునికీకరణ అత్యవసరమని పేర్కొంది. ఎకరం భూమి ఉండి, ఆ భూమిపై హక్కుల నిరూపణకు కావాల్సిన సరైన కాగితాలు లేకున్నా లేదా భూరికార్డుల్లో సరైన వివరాలు లేకపోయినా, ఏటా పంట రుణాలు, ప్రభుత్వ సహాయాలు, ఇతర రూపాల్లో అందాల్సిన దాదాపు యాభైవేల రూపాయల మేలు అందకుండా పోతున్నట్లు అంచనా. భూమి ఉండి కూడా దానిని పెట్టుబడిగా మార్చడానికి వీలుకావడం లేదు. భూమికి భద్రమైన హక్కులు కల్పించి ఆధునికీకరించిన రికార్డులను అందరికీ అందుబాటులో ఉంచితే లక్షల కోట్ల రూపాయల విలువైన భూమి పెట్టుబడిగా మారి సంపద సృష్టికి కారణమవుతుంది, తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, పేదరికం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు, వ్యవసాయ దిగుబడులపై భూహక్కుల ప్రభావంపై చేసిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం- భద్రమైన భూహక్కులు కల్పిస్తే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుందని వెల్లడైంది. ఈ క్రమంలో గత మూడు దశాబ్దాలుగా భూమి రికార్డుల ఆధునికీకరణకు, భూహక్కులకు ప్రభుత్వమే పూర్తి హామీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమలులోఉన్న డిజిటల్ ఇండియా భూరికార్డుల ఆధునికీకరణ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో ఈ వ్యవస్థను సుసాధ్యం చేయాలనేది లక్ష్యం. నీతిఆయోగ్ ఇటీవల రూపొందించిన దార్శనిక పత్రంలో కూడా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండే 2022 నాటికి దేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉండాలని పేర్కొంది.
భూరికార్డుల ఆధునికీకరణ కోసం కేంద్రం ఎనభయ్యవ దశకంలో భూరికార్డుల కంప్యూటరీకరణ (సీఎల్ఆర్) పథకాన్ని రూపొందించింది. ఆ తరవాతి కాలంలో రెవిన్యూ శాఖను పటిష్ఠపరచడం, భూరికార్డుల నవీకరణ కోసం మరో పథ]కాన్ని అమలులోకి తెచ్చింది. 2008లో ఈ రెండు పథ]కాలను కలిపి జాతీయ భూరికార్డుల ఆధునికీకరణ (ఎన్ఎల్ఆర్ఎంపీ) పథకంగా మార్చారు. దీనికి 2015లో కొన్ని మార్పులు చేసి డిజిటల్ ఇండియా భూరికార్డుల ఆధునికీకరణ పథకంగా అమలు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు రికార్డులను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల నవీకరణ (ఎల్ఆర్యూపీ) పథÅ]కం ద్వారా రికార్డులు సరిచేసి, కొత్త ఆర్ఓఆర్(హక్కుల రికార్డు) చట్టం, ధరణి వెబ్సైట్ ద్వారా భూసేవలను మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేసింది. ఏపీలో 'మీ భూమి, మీ హక్కు' కార్యక్రమం ద్వారా రికార్డులు సరిచేసి 'మీ భూమి' వెబ్సైట్ రూపొందించారు. భూముల సమగ్ర సర్వే చేసి టైటిల్ గ్యారంటీ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం కూడా రాబోయే నాలుగేళ్లలో ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. పల్లెల సర్వే, ఆధునిక సాంకేతికతతో పల్లె ప్రాంతాల గుర్తింపుగా వ్యవహరించే- 'స్వామిత్వ' యోజన ద్వారా దేశంలోని ఏడు లక్షల పైచిలుకు గ్రామాల్లో ప్రతి ఇంటి స్థలాన్ని డ్రోన్ల ద్వారా కొలిచి ఆస్తి కార్డులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది.
![Land act Expert Sunil Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11984739_926_11984739_1622602151018.png)
మంచి ర్యాంకు
భూరికార్డులు మెరుగు పడితేనే సులభతర వ్యాపార సూచీలో దేశానికి మంచి ర్యాంకు వస్తుంది. పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ ప్రతి ఏటా భూపరిపాలన మెరుగు పరిచేందుకు పలు సూచనలు అందిస్తోంది. ఈ సంవత్సరం ఇచ్చిన సూచనలలో ప్రతి భూమికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని, గత ఇరవై ఏళ్ల హక్కుల రికార్డు, రిజిస్టర్డ్ దస్తావేజులు ఆన్లైన్లో ఉంచాలని, సర్వే చేసి పటాలు రూపొందించాలని, అన్ని భూరికార్డులను ఒకేచోట అందుబాటులో ఉంచాలని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేసారి జరిగే ఏర్పాటు చెయ్యాలని పేర్కొంది. అభివృద్ధి సౌధానికి స్పష్టమైన, భద్రమైన రికార్డులే బలమైన పునాది. ప్రజలను భాగస్వాములను చేస్తూ ఆధునిక పరిజ్ఞానం సహాయంతో రికార్డులు సరిచేసే ప్రయత్నం జరగాలి. పైపై మెరుగులు కాకుండా సమూల మార్పులకు కృషి జరగాలి. కరోనా కల్లోలం తెచ్చిన ఆర్థిక సంక్షోభానికి భూపరిపాలన, భూరికార్డుల నిర్వహణ మెరుగు పరచడమే సరైన పరిష్కారం.
సూచీల్లో రాష్ట్రాలిలా..
జాతీయ ఆర్థిక పరిశోధన మండలి గత నెల విడుదల చేసిన భూరికార్డులు, సేవల సూచీ-2021 ప్రకారం డెబ్భైకిపైగా మార్కులతో మధ్యప్రదేశ్, పశ్చిమ్బంగ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో, తెలంగాణ పదమూడో స్థానంలో నిలిచాయి. భూరికార్డులు ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? రికార్డులు పొందే ప్రక్రియ సులభంగా ఉందా? రికార్డులు పొందడంలో ప్రజలకు ఎలాంటి సహాయం అందుతోంది? ఈ అంశాల ఆధారంగా రూపొందించిన సౌలభ్య సూచీలో ఒడిశా, పశ్చిమ్బంగ, కర్ణాటక, బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు మొదటి అయిదు స్థానాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పదమూడు, తెలంగాణ పదిహేనో స్థానంలో నిలిచాయి.
- ఎం. సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణులు, నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయ అనుబంధ ఆచార్యులు
ఇదీ చదవండి:'వ్యవసాయ రంగ అభివృద్ధితోనే స్వావలంబన'