ETV Bharat / opinion

విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి- ఆలస్యం చేస్తే అస్తవ్యస్తమే!

author img

By

Published : Apr 28, 2020, 9:05 AM IST

లాక్‌డౌన్‌, భౌతిక దూరం పాటింపు, క్వారంటైన్లతో- కరోనా మరణాలు తగ్గేలా చేసింది భారత్. అయినా అంతా బాగానే ఉందనుకోవడానికి వీల్లేదు. మళ్లీ సాధారణ వాతావరణం ఏర్పడనంతవరకు పరిస్థితి అదుపులోకి రానట్లే అనుకోవాలి. ప్రపంచం ఆర్థికంగా, సామాజికంగా తిరిగి పట్టాలెక్కాలంటే- కరోనా వ్యాధి వచ్చినవారిని, రోగ లక్షణాలు బయటపడనివారిని శీఘ్రంగా గుర్తించి చికిత్స చేయడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.

corona testing
కరోనా పరీక్షలు

కరోనా కేసులు బయటపడిన తరవాత ప్రభుత్వాలు ఎంత శీఘ్రంగా స్పందిస్తే, వ్యాధి అంత త్వరగా అదుపులోకి వస్తుంది. ఉదాహరణకు ఐరోపాలో ఇరుగుపొరుగు దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఏప్రిల్‌ 27 నాటికి నమోదైన కరోనా కేసులు రమారమి సమానమే. ఫ్రాన్స్‌లో 1,62,100, జర్మనీలో 1,57,770 కేసులు నమోదయ్యాయి. కానీ, ఫ్రాన్స్‌లో 22,586 మంది మృత్యువాత పడ్డారు. జర్మనీలో మృతుల సంఖ్య కేవలం 5,976.

కరోనా మహమ్మారి జాడలు గుర్తించిన వెంటనే జర్మనీ భౌతిక దూరం పాటింపును తప్పనిసరి చేసి, విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ఫ్రాన్స్‌ అలా మేల్కొనక ఆలస్యం చేసినందువల్ల చేదు ఫలితాల్ని చవిచూడాల్సి వచ్చింది. ఏప్రిల్‌ 27 నాటికి జర్మనీ 20,72,669 కరోనా పరీక్షలు నిర్వహించి, ఐరోపా ఖండంలో ప్రథమ స్థానం ఆక్రమిస్తే, ఫ్రాన్స్‌లో జరిగిన పరీక్షలు 4,63,662 మాత్రమే.

భారత్‌ ముందున్న మార్గమేమిటి?

భారత్​లో ఏప్రిల్‌ 27నాటికి మొత్తం 6,65,819 పరీక్షలు చేయగా, ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 482 పరీక్షలు జరిగాయి. అదే సింగపూర్‌లో ప్రతి 10 లక్షలమందికి 20,815, దక్షిణ కొరియాలో 11,735, తైవాన్‌లో 2,559, వియత్నాంలో 2,188 పరీక్షలు చేశారు. అందుకే ఆ దేశాలు కొవిడ్‌ 19ను అధిగమించగలిగాయి.

భారత దేశంలోని 130 కోట్లపైచిలుకు జనాభా అంతటినీ ఈ స్థాయిలో పరీక్షించడానికి కావలసిన నిధులు, టెస్టింగ్‌ సామగ్రితో పాటు, సిబ్బందీ లేరు. ఈ సమస్యను అధిగమించడానికి భారత్‌లో కేవలం రోగ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే పరీక్షించి క్వారంటైన్‌ చేస్తున్నారు. జనం బయట తిరగకుండా లాక్‌డౌన్‌ను ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రపంచంలో ఏప్రిల్‌ 27 నాటికి ప్రతి 10 లక్షల జనాభాలో 386 మందికి కరోనా సోకగా, భారత్‌లో కేవలం 20 మందికి సోకిందని అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రపంచంలో ప్రతి 10 లక్షల జనాభాలో ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నవారు సగటున 26.6 మంది, అమెరికాలో 167 అయితే, భారత్‌లో మరణాల రేటు కేవలం 0.6 మాత్రమే.

పూల్​ పద్ధతిలో..

కానీ, భారత్‌లో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారని విమర్శకులు అంటున్నారు. పోనీ ప్రభుత్వం వెలువరిస్తున్న గణాంకాలు తప్పే అనుకున్నా, కొవిడ్‌ మరణాలను సర్కారు కప్పిపెట్టలేదు కదా! ఇటలీ, న్యూయార్క్‌లలో మాదిరిగా భారత్‌లోనూ మృతదేహాల గుట్టలు కనిపించినట్లు వార్తలు రాలేదు. శ్మశానాలకు తాకిడీ పెరగలేదు.

అలాగని అంతా బాగుందని భరోసాగా ఉండలేం. కరోనా పరీక్షలను మరింత విస్తృతం చేయాలి. ప్రతి పౌరుడికీ పరీక్ష చేసే స్తోమత లేనందున భారత్‌లో సామూహిక (పూల్‌) పరీక్షలు చేపడుతున్నారు. ఈ పద్ధతిలో అయిదు నమూనాలను కలిపి పరీక్షిస్తారు. అవి నెగెటివ్‌ అని తేలితే సమస్య లేదు. పాజిటివ్‌ వస్తే ప్రతి నమూనాను తిరిగి పరీక్షించి కరోనా సోకిన వ్యక్తిని గుర్తిస్తారు.

సేవల విస్తరణలో యంత్రాంగం

జర్మనీ పూల్‌ పద్ధతిలో మంచి ఫలితాలను సాధించింది. దక్షిణ కొరియా, సింగపూర్‌లలో మాదిరి అత్యధిక ప్రజానీకాన్ని పరీక్షించడం భారత్‌ వల్లకాని పని. ఇక్కడ మొదట్లో రోజుకు 3,000 నమూనాలను పరీక్షించగా, ఏప్రిల్‌ 15నాటికి అవి 21,000కు పెరిగాయి. దేశంలో ఇప్పటికే 2.45 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

భారత ప్రభుత్వం మే నెల నుంచి 10 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లను, మరో 10 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ కిట్లను స్వదేశంలోనే తయారు చేయాలని లక్షిస్తోంది. చైనా నుంచి అందిన 5.5 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టింగ్‌ కిట్లను కరోనా ఆచూకీ ఎక్కువగా కనిపించిన జిల్లాలకు కేంద్రం వెంటనే పంపిణీ చేసింది. చైనా నుంచి లక్ష ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ కిట్లనూ దిగుమతి చేసుకుంది. చైనా కిట్లు సరైన ఫలితాలివ్వడం లేదని తెలుస్తోంది.

భారత్‌ ఇంకా సీమెన్స్‌, రోషె, థర్మో ఫిషర్‌, ఆల్టోనా, సీజీన్‌ వంటి ఐరోపా కంపెనీల నుంచి, దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సర్‌ కంపెనీ నుంచి 10 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేస్తోంది. సొంత పరిజ్ఞానంతో టెస్టింగ్‌ కిట్లను తయారుచేస్తున్న మైల్యాబ్‌, మెడ్‌ సోర్స్‌ ఓజోన్‌, మోల్‌ బయో, కిల్‌ పెస్ట్‌ ఇండియా వంటి స్వదేశీ కంపెనీలకూ కిట్ల కోసం ఆర్డరు చేసింది. మొత్తం మీద 33 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లు చేతికి అందనున్నాయని, మరో 33 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్లకు ఆర్డరు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రతినిధి వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో నెలకు 6,000 వెంటిలేటర్లు తయారవుతున్నాయి. ఈ నెల 17 వరకు దేశంలో 1,919 ఆస్పత్రులను కొవిడ్‌ చికిత్సకు ప్రత్యేకించారు. 1,73,746 ఐసోలేషన్‌ పడకలు, 21,806 ఐసీయూ పడకలను అందుబాటులో ఉంచారు. వ్యాక్సిన్‌ కానీ, కరోనాను ఖాయంగా నయం చేసే మాత్రలు కానీ అందుబాటులోకి రానంతవరకు పరీక్ష, క్వారంటైన్‌, ఐసోలేషన్‌, ఐసీయూ చికిత్సా సౌకర్యాలను విస్తరించకతప్పదు.

ఆలస్యం చేస్తే అస్తవ్యస్తమే

అమెరికా ఏప్రిల్‌ 27 వరకు ప్రపంచంలో అత్యధికంగా 54,70,555 పరీక్షలు నిర్వహించినా, ఈ పని ఆలస్యంగా ప్రారంభించినందువల్ల మరణాలు పెరిగాయి. ఏప్రిల్‌ నెలలో అమెరికా రోజుకు సగటున 1,50,000 పైగానే పరీక్షలు నిర్వహించింది. కానీ, మే నెల మధ్యకల్లా ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించాలంటే ఇప్పటి నుంచి రోజుకు అయిదు లక్షల నుంచి ఏడు లక్షల పరీక్షల చొప్పున నిర్వహించాల్సి ఉంటుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.

కరోనా వల్ల ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య వరసగా 14 రోజులపాటు తగ్గినప్పుడే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) సూచించింది. ఏప్రిల్‌ 27నాటికి అమెరికాలో ప్రతి 10 లక్షల జనాభాకు 16,527 పరీక్షలు జరుగుతున్నాయి. ఇటలీలో 29వేల పైచిలుకు, జర్మనీలో దాదాపు 25 వేల పరీక్షలు చేస్తున్నారు. అందుకే అమెరికా, ఇటలీ, జర్మనీలు క్రమక్రమంగా ఆర్థిక రథాన్ని పట్టాలెక్కించడానికి సన్నద్ధమవుతున్నాయి.

(రచయిత- ఏఏవీ ప్రసాద్‌)

కరోనా కేసులు బయటపడిన తరవాత ప్రభుత్వాలు ఎంత శీఘ్రంగా స్పందిస్తే, వ్యాధి అంత త్వరగా అదుపులోకి వస్తుంది. ఉదాహరణకు ఐరోపాలో ఇరుగుపొరుగు దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఏప్రిల్‌ 27 నాటికి నమోదైన కరోనా కేసులు రమారమి సమానమే. ఫ్రాన్స్‌లో 1,62,100, జర్మనీలో 1,57,770 కేసులు నమోదయ్యాయి. కానీ, ఫ్రాన్స్‌లో 22,586 మంది మృత్యువాత పడ్డారు. జర్మనీలో మృతుల సంఖ్య కేవలం 5,976.

కరోనా మహమ్మారి జాడలు గుర్తించిన వెంటనే జర్మనీ భౌతిక దూరం పాటింపును తప్పనిసరి చేసి, విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ఫ్రాన్స్‌ అలా మేల్కొనక ఆలస్యం చేసినందువల్ల చేదు ఫలితాల్ని చవిచూడాల్సి వచ్చింది. ఏప్రిల్‌ 27 నాటికి జర్మనీ 20,72,669 కరోనా పరీక్షలు నిర్వహించి, ఐరోపా ఖండంలో ప్రథమ స్థానం ఆక్రమిస్తే, ఫ్రాన్స్‌లో జరిగిన పరీక్షలు 4,63,662 మాత్రమే.

భారత్‌ ముందున్న మార్గమేమిటి?

భారత్​లో ఏప్రిల్‌ 27నాటికి మొత్తం 6,65,819 పరీక్షలు చేయగా, ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 482 పరీక్షలు జరిగాయి. అదే సింగపూర్‌లో ప్రతి 10 లక్షలమందికి 20,815, దక్షిణ కొరియాలో 11,735, తైవాన్‌లో 2,559, వియత్నాంలో 2,188 పరీక్షలు చేశారు. అందుకే ఆ దేశాలు కొవిడ్‌ 19ను అధిగమించగలిగాయి.

భారత దేశంలోని 130 కోట్లపైచిలుకు జనాభా అంతటినీ ఈ స్థాయిలో పరీక్షించడానికి కావలసిన నిధులు, టెస్టింగ్‌ సామగ్రితో పాటు, సిబ్బందీ లేరు. ఈ సమస్యను అధిగమించడానికి భారత్‌లో కేవలం రోగ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే పరీక్షించి క్వారంటైన్‌ చేస్తున్నారు. జనం బయట తిరగకుండా లాక్‌డౌన్‌ను ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రపంచంలో ఏప్రిల్‌ 27 నాటికి ప్రతి 10 లక్షల జనాభాలో 386 మందికి కరోనా సోకగా, భారత్‌లో కేవలం 20 మందికి సోకిందని అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రపంచంలో ప్రతి 10 లక్షల జనాభాలో ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నవారు సగటున 26.6 మంది, అమెరికాలో 167 అయితే, భారత్‌లో మరణాల రేటు కేవలం 0.6 మాత్రమే.

పూల్​ పద్ధతిలో..

కానీ, భారత్‌లో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారని విమర్శకులు అంటున్నారు. పోనీ ప్రభుత్వం వెలువరిస్తున్న గణాంకాలు తప్పే అనుకున్నా, కొవిడ్‌ మరణాలను సర్కారు కప్పిపెట్టలేదు కదా! ఇటలీ, న్యూయార్క్‌లలో మాదిరిగా భారత్‌లోనూ మృతదేహాల గుట్టలు కనిపించినట్లు వార్తలు రాలేదు. శ్మశానాలకు తాకిడీ పెరగలేదు.

అలాగని అంతా బాగుందని భరోసాగా ఉండలేం. కరోనా పరీక్షలను మరింత విస్తృతం చేయాలి. ప్రతి పౌరుడికీ పరీక్ష చేసే స్తోమత లేనందున భారత్‌లో సామూహిక (పూల్‌) పరీక్షలు చేపడుతున్నారు. ఈ పద్ధతిలో అయిదు నమూనాలను కలిపి పరీక్షిస్తారు. అవి నెగెటివ్‌ అని తేలితే సమస్య లేదు. పాజిటివ్‌ వస్తే ప్రతి నమూనాను తిరిగి పరీక్షించి కరోనా సోకిన వ్యక్తిని గుర్తిస్తారు.

సేవల విస్తరణలో యంత్రాంగం

జర్మనీ పూల్‌ పద్ధతిలో మంచి ఫలితాలను సాధించింది. దక్షిణ కొరియా, సింగపూర్‌లలో మాదిరి అత్యధిక ప్రజానీకాన్ని పరీక్షించడం భారత్‌ వల్లకాని పని. ఇక్కడ మొదట్లో రోజుకు 3,000 నమూనాలను పరీక్షించగా, ఏప్రిల్‌ 15నాటికి అవి 21,000కు పెరిగాయి. దేశంలో ఇప్పటికే 2.45 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

భారత ప్రభుత్వం మే నెల నుంచి 10 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లను, మరో 10 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ కిట్లను స్వదేశంలోనే తయారు చేయాలని లక్షిస్తోంది. చైనా నుంచి అందిన 5.5 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టింగ్‌ కిట్లను కరోనా ఆచూకీ ఎక్కువగా కనిపించిన జిల్లాలకు కేంద్రం వెంటనే పంపిణీ చేసింది. చైనా నుంచి లక్ష ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ కిట్లనూ దిగుమతి చేసుకుంది. చైనా కిట్లు సరైన ఫలితాలివ్వడం లేదని తెలుస్తోంది.

భారత్‌ ఇంకా సీమెన్స్‌, రోషె, థర్మో ఫిషర్‌, ఆల్టోనా, సీజీన్‌ వంటి ఐరోపా కంపెనీల నుంచి, దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సర్‌ కంపెనీ నుంచి 10 లక్షల ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేస్తోంది. సొంత పరిజ్ఞానంతో టెస్టింగ్‌ కిట్లను తయారుచేస్తున్న మైల్యాబ్‌, మెడ్‌ సోర్స్‌ ఓజోన్‌, మోల్‌ బయో, కిల్‌ పెస్ట్‌ ఇండియా వంటి స్వదేశీ కంపెనీలకూ కిట్ల కోసం ఆర్డరు చేసింది. మొత్తం మీద 33 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్లు చేతికి అందనున్నాయని, మరో 33 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్లకు ఆర్డరు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రతినిధి వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో నెలకు 6,000 వెంటిలేటర్లు తయారవుతున్నాయి. ఈ నెల 17 వరకు దేశంలో 1,919 ఆస్పత్రులను కొవిడ్‌ చికిత్సకు ప్రత్యేకించారు. 1,73,746 ఐసోలేషన్‌ పడకలు, 21,806 ఐసీయూ పడకలను అందుబాటులో ఉంచారు. వ్యాక్సిన్‌ కానీ, కరోనాను ఖాయంగా నయం చేసే మాత్రలు కానీ అందుబాటులోకి రానంతవరకు పరీక్ష, క్వారంటైన్‌, ఐసోలేషన్‌, ఐసీయూ చికిత్సా సౌకర్యాలను విస్తరించకతప్పదు.

ఆలస్యం చేస్తే అస్తవ్యస్తమే

అమెరికా ఏప్రిల్‌ 27 వరకు ప్రపంచంలో అత్యధికంగా 54,70,555 పరీక్షలు నిర్వహించినా, ఈ పని ఆలస్యంగా ప్రారంభించినందువల్ల మరణాలు పెరిగాయి. ఏప్రిల్‌ నెలలో అమెరికా రోజుకు సగటున 1,50,000 పైగానే పరీక్షలు నిర్వహించింది. కానీ, మే నెల మధ్యకల్లా ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించాలంటే ఇప్పటి నుంచి రోజుకు అయిదు లక్షల నుంచి ఏడు లక్షల పరీక్షల చొప్పున నిర్వహించాల్సి ఉంటుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.

కరోనా వల్ల ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య వరసగా 14 రోజులపాటు తగ్గినప్పుడే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) సూచించింది. ఏప్రిల్‌ 27నాటికి అమెరికాలో ప్రతి 10 లక్షల జనాభాకు 16,527 పరీక్షలు జరుగుతున్నాయి. ఇటలీలో 29వేల పైచిలుకు, జర్మనీలో దాదాపు 25 వేల పరీక్షలు చేస్తున్నారు. అందుకే అమెరికా, ఇటలీ, జర్మనీలు క్రమక్రమంగా ఆర్థిక రథాన్ని పట్టాలెక్కించడానికి సన్నద్ధమవుతున్నాయి.

(రచయిత- ఏఏవీ ప్రసాద్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.