Food Habits: తీసుకునే ఆహారాన్ని బట్టే ఆరోగ్యం.. వైద్యులు, పోషకాహార నిపుణులు పదే పదే చేస్తున్న సూచన ఈ క్రమంగా ఫలితం ఇస్తోంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతుండటంతో ఇంటికి తెప్పించుకునే ఆహారం విషయంలో ప్రాధాన్యాలు మారుతున్నాయి. రోజూ కాకపోయినా రెండురోజులు అందుకోసం కేటాయిస్తున్నారు. ప్రత్యేకించి సోమవారం, గురువారం ఆరోగ్యకర తిండినే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
ఈ విషయంలో బెంగళూరు నగరం ముందుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ నిల్చింది. ఏటా ప్రకటించినట్లుగానే స్విగ్గీ ‘స్టాట్ఈటస్టిక్స్-2021’ను మంగళవారం విడుదల చేసింది. ఏడాది కాలంలో తమకొచ్చిన ఆర్డర్ల ఆధారంగా విశ్లేషణ చేసింది. పిండి పదార్థాలు తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కీటో డైట్ ఆర్డర్లు 23 శాతం, మొక్కల నుంచి వచ్చే ఆహారం వేగాన్ రుచులు 83 శాతం పెరిగినట్లు తెలిపింది. నివేదికలోని ఆసక్తికర విషయాలు..
ఆరో ఏడూ బిర్యానీదే..
హైదరాబాదీల బహు పసందైన వంటకం నోరూరించే బిర్యానీ అని తెలుసు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది బిర్యానీనే ఇష్టపడుతున్నారు. వరుసగా ఆరో ఏడాది బిర్యానీకే అగ్ర తాంబూలం దక్కింది.
* బిర్యానీ గత ఏడాది ఆర్డర్లనుచూస్తే నిమిషానికి 90 ఉండేవి. ఈసారి అది 115కి పెరిగింది. శాకాహార బిర్యానీతో పోలిస్తే చికెన్ బిర్యానీనే 4.3 రేట్లు ఎక్కువగా ఆర్డర్లు ఉంటున్నాయి.
* రకరకాల చిరుతిళ్లు అందుబాటులోకి వచ్చినా ఎక్కువ మంది సమోసానే ఇష్టపడుతున్నారు. ఏడాదికాలంలో స్విగ్గీలో 50 లక్షల ఆర్డర్లు సమోసావే. పావ్బాజీ 21 లక్షలతో రెండో స్థానంలో నిల్చింది.
* మిఠాయిల్లో గులాబ్జామ్ 21 లక్షలతో మొదటి 12.7 లక్షలతో రస్మలైయ్ రెండో స్థానంలో నిలిచింది.
* హైదరాబాదీయులు ఎక్కువగా చికెన్ బిర్యానీ, చికెన్ 65, పనీర్ బటర్ మసాలా, మసాలా దోశ, ఇడ్లీ ఆర్డర్ చేశారు.
* ఓ వ్యక్తి నాలుకను శుభ్రం చేసుకునే టంగ్ క్లీనర్ను ఇంటికి సమీపంలోని 200 మీటర్ల దూరంలోని స్టోర్ నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేశారు.
* 2.8కోట్లు ప్యాకెట్ల పండ్లు, కూరగాయలు డెలివరీ చేశారు. అందులో టమాటా, అరటిపండ్లు, ఆలుగడ్డ, పచ్చిమిర్చి కోసం ఎక్కువగా ఉన్నాయి.
ఇవీ చూడండి: