కల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు కళ్లు తిరిగి పడిపోయి మృతి చెందారు. మరో ఇద్దరు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకొంది. జడ్చర్లకు చెందిన వెంకటేశ్(30), కాశీం(35), శ్రీనివాస్లు ఆదివారం మధ్యాహ్నం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు గ్రామానికి నడుచుకొంటు వెళ్లి కల్లు తాగారు.
తిరిగి వస్తుండగా వెంకటేశ్, కాశీంలు కళ్లు తిరిగి పడిపోయారు. వారి వెంట ఉన్న శ్రీనివాస్ కల్లు కొద్దిగానే తాగడంతో స్పృహలో ఉన్నారు. ఈ విషయాన్ని వారి బందువులకు చెప్పి.. 108 వాహనంలో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.
వెంకటేశ్ భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. వారితో కలిసి కల్లు తాగడానికి వెళ్లిన శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆలూరు వెళ్లి దుకాణంలో విక్రయిస్తున్న కల్లు, తినుబండారాల నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షలకు పంపామని ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ వీరస్వామి చెప్పారు.
అక్కడే కల్లు తాగిన మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురై జడ్చర్ల ఆసుపత్రికి వచ్చారు. వారిలో ఒకరు చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోగా.. పాండు అనే వ్యక్తికి చికిత్స కొనసాగుతోంది. కల్లు తాగాక కాసేపటికి కళ్లు తిరిగాయని. విరేచనాలు అయ్యాయని పోలీసుల విచారణలో పాండు వివరించారు.
ఇదీ చూడండి : పిల్లర్ కారణంగా బాలుడు మృతి