సంపన్నులకు మాత్రమే గతంలో లభ్యమయ్యే మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ, ఐటీ రంగం మొదలు మధ్య తరగతి ప్రజలు, చివరకు పాఠశాల విద్యార్థులను కూడా మత్తులోకి లాగుతున్నాయి. నైజీరియా, ఐరోపా దేశాల నుంచి దిగుమతయ్యే కొకైన్, చరాస్ వంటి మాదకద్రవ్యాలు ఇప్పడు స్థానికంగానే లభిస్తున్నాయి.
గోవా, బెంగళూరు, ముంబయి, రాజస్థాన్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. చిన్నాచితక గంజాయి కేసులు నమోదయ్యే జంటనగరాల్లో.. ఇప్పుడు ఎండీఎంఏ బ్లోట్స్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో మత్తు పదార్ధాల కేసులంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు స్థానికులే డ్రగ్స్ తయారు చేసి, దిగుమతి చేసుకోవడం మొదలు విక్రయించడం, వాడడం వంటివి సర్వ సాధారణంగా మారిపోయాయి.
మూడో స్థానంలో...
మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల వినియోగంలో గోవా, దిల్లీ నగరాల తర్వాత హైదరాబాద్ మూడో స్థానానికి చేరుకుంది. మూడు సంవత్సరాల క్రితం కెల్విన్ అనే మాదకద్రవ్యాల సరఫరాదారుడి అరెస్టు తర్వాత పెద్ద సంఖ్యలో సినీ నటులను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. ఆ కేసులో సినీ ప్రముఖులను బాధితులుగానే పేర్కొన్నారు.
పార్టీల్లో ఎక్కువవుతున్న వినియోగం..
సినీ పరిశ్రమలో, ఐటీ రంగంలో, పాఠశాల విద్యార్థుల పార్టీల్లో మాదకద్రవ్యాలు భాగమవుతున్నాయి. పండుగలు, పుట్టినరోజు వేడుకలు, పర్వదినాలు, నూతన సంవత్సర వేడుకలు, బార్లు, పబ్లు, రిసార్ట్లలో జరిగే పార్టీల్లో మత్తుపదార్ధాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మాదకద్రవ్యాలకు బానిసైన వారు కొందరు.. అధిక సంపాదన కోసం మరికొందరు.. గోవా, ముంబయి, బెంగళూరు వంటి నగరాల నుంచి వీటిని తీసుకొస్తున్నారు.
మత్తు పదార్థాలకు అడ్డా..
జంటనగరాల శివార్లలో మూతపడ్డ ఫార్మా పరిశ్రమలు కూడా ఇప్పడు మత్తు పదార్థాల ముఠాలకు అడ్డాగా తయారయ్యాయి. జీడిమెట్ల, చర్లపల్లి, నాచారం, హయత్నగర్ ప్రాంతాల్లో నిషేధిత మత్తుపదార్థాల తయారీ కేంద్రాల గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్, ఎక్సైజ్ పోలీసులు పలు సందర్భాల్లో గుట్టురట్టు చేశారు. ఆగష్టు నెలలో మాదకద్రవ్యాల తయారీ కేంద్రాలపై డీఆర్ఐ అధికారులు వరుస దాడులు నిర్వహించి సుమారు రూ.వంద కోట్లు విలువ చేసే నిషేధిత మత్తపదార్థాలను సీజ్ చేశారు.
జోరుగా రవాణా..
ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయి రవాణ జోరుగా సాగుతోంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి ఖమ్మం.. అక్కడి నుంచి హైదరాబాద్ మీదగా మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి రవాణా కొనసాగుతోంది. ఇటీవల విశాఖపట్నం నుంచి ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి రూ.కోటి ముపై లక్షలు విలువ చేసే సుమారు 1,000 కిలోల గంజాయి రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
జిల్లాల్లోనూ జోరుగా!
ఆరు నెలల క్రితం కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన బీటెక్ విద్యార్థులు గంజాయి సరఫరా చేస్తూ దొరికిపోయారు. రెండు నెలల క్రితం భద్రాచలం అవుట్పోస్టు వద్ద సుమారు రూ.8 కోట్ల విలువైన గంజాయి పట్టుకున్నారు. ఇటీవల కరీంనగర్లో 270 కిలోలు, మణుగూరులో 119 కిలోల గంజాయి పట్టుబడింది. ఖమ్మం నుంచి ట్రాక్టర్లో మహారాష్ట్రకు తరలిస్తున్న 440 కిలోల గంజాయిని ఇటీవలే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని చర్యలు..
మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల రవాణా అరికట్టడానికి ప్రభుత్వాలు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్, బార్లతో పాటు శివార్లలోని రిసార్ట్లపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలు స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధానంగా యువత వీటి వైపు మళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
కౌన్సిలింగ్...
మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్న యువకులను తల్లిదండ్రులు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి తగిన చికిత్స చేయించాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటి వాడకం వలన కలిగే అనర్థాలను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతున్నారు. అధికార యంత్రాంగం సమష్టి కృషితో మాదకద్రవ్యాలు, మత్తపదార్థాల తయారీ, ఎగుమతి, దిగుమతిని పూర్తిగా నిర్మూలించవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.