స్థల వివాదంలో గొడవ.. పరస్పరదాడుల్లో ఒకరి పరిస్థితి విషమం - మిర్యాలగూడలో రెండు వర్గాల మధ్య గొడవ
ఇరువర్గాల మధ్య స్థల వివాదం చిచ్చురేపింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది.
![స్థల వివాదంలో గొడవ.. పరస్పరదాడుల్లో ఒకరి పరిస్థితి విషమం Conflict over space one's situation is poisonous in nalgonda dist miryalaguda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9915548-174-9915548-1608223688343.jpg?imwidth=3840)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థల వివాదంపై రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అద్దంకి-నార్కట్పల్లి రహదారి పక్కన 139 గజాల స్థలం గొడవకు కారణమైంది. పట్టణానికి చెందిన కప్పల రామచంద్రయ్య కుటుంబానికి వంశపారంపర్యంగా సంక్రమించిన భూమిని జానీ భాష కబ్జా చేశాడనే ఆరోపణలతో కొద్ది నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఆ స్థలంలో జానీ భాష గోడ నిర్మిస్తుండగా వెళ్లి రామచంద్రయ్య కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.
అదే సమయంలో మాటమాట పెరిగి ఇరువర్గాలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘర్షణలో కప్పల స్టాలిన్బాబు తలకు బలమైన గాయమై 14 కుట్లు పడ్డాయి. మెదడులో రక్తం గడ్డ కట్టగా మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాదుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. దాడిలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆండాలును రాత్రి నుంచి పోలీస్స్టేషన్లో ఉంచడాన్ని నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు.