ఇరాన్లోని బుషెహర్ ప్రాంతంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రెండో అణు రియాక్టర్ నిర్మాణ పనులను రష్యాతో కలిసి ప్రారంభించింది ఇరాన్. ఆ దేశ అణు శక్తి సంస్థ అధ్యక్షుడు అలీ అక్బర్ సాలేహీ, రష్యా రోసాటామ్ న్యూక్లియర్ ఏజెన్సీ ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్ లోక్షిన్.. ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.
అణు ఇంధన ఒప్పందం-2015 ఇరాన్కు అనుకూలంగా ఉందంటూ 2018, మేలో ఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా. ఇరాన్పై పలు ఆంక్షలు విధించింది. అణు ఇంధనం విద్యుత్తు ఉత్పతికి వినియోగించుకునే విషయంపై ఆంక్షలు లేవని తెలిపింది ఇరాన్. ఈ క్రమంలో కీలక ముందడుగు వేసింది.
ప్రత్యామ్నాయంగా..
ముడి చమురు, గ్యాస్లపై ఆధారపడకుండా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ప్రత్యామ్నాయంగా న్యూక్లియర్ ప్లాంట్లను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకుంది. 2027-28 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 3,000 మెగా వాట్ల అణు విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
బుషెహర్లో ప్రస్తుతం ఉన్న వెయ్యి మెగావాట్ల అణు రియాక్టర్ను రష్యా నిర్మించింది. ఇది 2011 లో ప్రారంభమైంది. 2015లో రష్యా సహా ఆరు దేశాలతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇరాన్. ఇందులో భాగంగా అణు విద్యుత్ ఉత్పత్తి కోసం రియాక్టర్లకు అవసరమయ్యే ఇంధనాన్ని రష్యా ఇరాన్కు సరఫరా చేస్తోంది.