పాకిస్థాన్కు చెందిన కాలమిస్ట్ నుస్రత్ మిర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఐదు సార్లు భారత్కు వచ్చి.. ఇక్కడి సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటిలిజెన్స్కు పంపించానని చెప్పారు. భారత్లో పర్యటించేందుకు తనకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ నుంచి చాలా సార్లు అవకాశాలు వచ్చాయని తెలిపారు. సాధారణంగా భారత్లో మూడు ప్రాంతాలకు వెళ్లేందుకే అనుమతులు ఇస్తారని.. కానీ తనకు ఏడు ప్రాంతాల్లో పర్యటించేలా అనుమతిచ్చారని పేర్కొన్నారు. వర్చువల్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మహ్మద్ హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో నన్ను భారత్కు ఆహ్వానించారు. 2007-2017 సమయంలో ఐదు సార్లు భారత్కు వచ్చాను. దిల్లీ, బెంగళూరు, చెన్నై, పట్నా, కోల్కతా నగరాల్లో తిరిగాను. ఉర్దూ పత్రిక అయిన 'మిల్లీ గెజిట్' పబ్లిషర్ జఫారుల్ ఇస్లాం ఖాన్ను కలిశాను. ఆ తర్వాత వారు పిలిచి ఇలాంటి సమాచారం మరింత తేవాలని కోరారు. నేను తెచ్చిన సమాచారాన్ని పరిశీలించారు. భారత దేశ నాయకుల బలహీనతలన్నీ వారికి తెలుసు. భారత దేశ పరిస్థితులు, వారి పని విధానాలు తెలుసు. ముస్లింలలో చాలా మంది నాకు స్నేహితులున్నారు. అనేక ఉర్దూ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చాను. పాకిస్థాన్లో సమస్య ఏంటంటే నూతన ఆర్మీ చీఫ్ వస్తే పాత చీఫ్ చేసిన పనులన్నింటినీ నిలిపివేసి మళ్లీ కొత్తగా ప్రారంభిస్తారు. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయి. నేను 26 ప్రాంతాల్లో జరుగుతున్నాయని అనుకున్నాను. కానీ 67 ప్రాంతాల్లో జరుగుతున్నాయని ఒకరి ద్వారా నాకు తెలిసింది" అని నుస్రత్ మిర్జా చెప్పారు.
ఇమ్రాన్కు చురకలు:
మరోవైపు, ప్రపంచ వేదికపై పాకిస్థాన్ నమ్మకాన్ని కోల్పోయిందన్నారు నుస్రత్ మిర్జా. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సొంత పార్టీలోను నాయకుడిగా రాణించలేదని అభిప్రాయపడ్డారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్తో చైనా సమస్యను తీవ్రతరం చేస్తోందని పేర్కొన్నారు. నుస్రత్ మిర్జా సింధ్ ముఖ్యమంత్రి వద్ద సలహాదారుగా పనిచేశారు.
ఇవీ చదవండి:
ఉక్రెయిన్ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం.. పుతిన్ నిర్ణయం
వచ్చేవారం శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక... బరిలో విపక్ష నేత ప్రేమదాస