Nityananda Paraguay Minister Issue : భారత్ నుంచి పారిపోయి ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో నివాసం ఉంటున్నట్లు భావిస్తున్న వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు తలనొప్పిగా మారారు! నిత్యానంద ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్న ఊహాజనిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులతో అవగాహనా ఒప్పందం చేసుకున్న పరాగ్వే వ్యవసాయశాఖ మంత్రి ఆర్నాల్డో చమర్రో ఉద్యోగాన్ని కోల్పోయారు. మరోవైపు ఇదే తరహాలో నిత్యానంద దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను తప్పుదోవపట్టించినట్లు సమాచారం.
ఈ ఏడాది మొదట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాసతో దౌత్యసంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పరాగ్వే మంత్రి అర్నాల్డో చమర్రో ఓ ప్రకటనపై సంతకం చేశారు. దీనిపై పరాగ్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇదో కుంభకోణమని ఆరోపిస్తూ.. నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తూర్పార పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరాగ్వే వ్యవసాయ శాఖ మంత్రి ఆర్నాల్డో తన పదవికి రాజీనామా చేశారు.
ఇదే విషయంపై చమర్రో స్థానిక మీడియాకు వివరణ ఇచ్చారు. తనకు కైలాస దేశం ఎక్కడుందో తెలీదనీ.. నీటిపారుదల సహా ఇతర సమస్యల్లో సాయం చేస్తామని నిత్యానంద ప్రతినిధులు చెప్పడం వల్లనే పత్రంపై సంతకం చేశానని చెప్పారు. నిత్యానంద ప్రతినిధులు కూడా ఈ వివరాలను తమ వెబ్సైట్లో పొందుపరిచారు. పరాగ్వేలోని వివిధ మున్సిపాలిటీల అధికారులతో కూడా ఒప్పందం కుదిరినట్లు వివరించారు. పరాగ్వే మాత్రమే కాకుండా కెనడా, అమెరికాలోని నెవార్క్ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధులు ఈ విధంగా మోసం చేశారు. ఈ విషయాన్ని నెవార్క్ అధికారులే స్వయంగా వెల్లడించారు.
ప్రసంగాలు తప్ప.. ఎప్పుడూ!
Nithyananda India : నిత్యానంద భారత్లో అత్యాచారం సహా వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2019లో ఆయన గుర్తుతెలియని ప్రదేశానికి పారిపోయారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో నిత్యానంద ఉన్నట్లు ఇంటర్ పోల్ వర్గాలు తెలిపాయి. ఈక్వెడార్ మాత్రం తాము ఎవరికీ దీవిని అమ్మలేదని చెబుతోంది. నిత్యానంద కూడా గ్రాఫిక్స్ రూంలో కూర్చుని ప్రసంగాలు ఇవ్వడమే తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో ఎప్పుడూ కనిపించలేదు. గతంలో కైలాస ప్రతినిధి అని చెప్పి.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో భారత్పై పలు ఆరోపణలు చేశారు.
ఐరాస మీటింగ్లో నిత్యానంద 'కైలాస' దేశం ప్రతినిధులు.. భారత్పై ఆరోపణలు!
'నేను చనిపోలే.. సమాధిలోకి వెళ్లా అంతే! 27 మంది డాక్టర్లతో..'