British Queen Elizabeth-II : బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాన్ని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో లండన్లో ఉన్న ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్, అతడి భార్య క్యామిల్లా.. స్కాట్లాండ్లోని బాల్మోరల్ క్యాజిల్కు వెళ్లారు. అక్కడే రాణి ఎలిజబెత్ తన మనవడు ప్రిన్స్ విలియమ్తో ఉంటున్నారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా రాణి నివాసానికి చేరుకుంటున్నట్లు సమాచారం.
రాణి ఎలిజబెత్ను గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్లోని బాల్మోరల్ క్యాజిల్లో ఉంటున్న ఆమె.. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం నాడు సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్లాండ్కు వెళ్లి రాణి ఎలిజబెత్ను కలుసుకున్నారు.
రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ స్పందించారు. ఎలిజబెత్ ఆరోగ్యంపై తనతో పాటు యావత్ దేశం ఆందోళన చెందుతోందన్నారు. తనతోపాటు దేశ ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు.
ఇవీ చదవండి: అమెరికాలో భారతి సంతతి వ్యక్తుల హవా.. విదేశాంగ శాఖలో ఒకరు.. జిల్లా కోర్టు జడ్జిగా మరొకరు
రిషి సునాక్ ఓటమి.. బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్.. మోదీ ట్వీట్