కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచదేశాలను కలవరానికి గురి చేస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. టీకా తీసుకున్నా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నంత మాత్రానా పూర్తి రక్షణ లభిస్తుందని భావించి నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించింది. సామూహిక వ్యాప్తిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ మాత్రమే సరిపోదని, మాస్కులు కూడా ధరిస్తూనే ఉండాలని డబ్ల్యూహెచ్ఓ మెడిసిన్స్ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా.మరియంజేలా సిమావ్ తేల్చి చెప్పారు.
గతేడాది చివరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించిన అగ్రరాజ్యం అమెరికా.. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. మొత్తం 50 రాష్ట్రాల్లో నూతన మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఆ దేశంలో 53 శాతం మంది ఒక్క డోసైనా తీసుకున్నారు. 46 శాతం మంది టీకా రెండు డోసులు వేయించుకున్నారు.
అయితే కరోనా డెల్టా వేరియంట్ల కారణంగా ప్రపంచానికి అతిపెద్ద ముప్పు తలెత్తిందని అమెరికా అంటు వ్యాధుల నిపుణులు డా. ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. ఇవి ఉన్నంతవరకు కరోనాను పూర్తిగా అంతం చేయడం సాధ్యం కాదన్నారు.
అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 20 శాతం డెల్టా వేరియంట్వే ఉంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ఇజ్రాయెల్లో 40 నుంచి 50 శాతం డెల్టా వేరియంట్కు సంబంధించినవే. బాధితుల్లో టీకా తీసుకున్నవారు కూడా ఉండటం ఆందోళన కల్గిస్తోంది.
డెల్టాపై వ్యాక్సిన్లు ప్రభావవంతమే కానీ..
కరోనా టీకాలు డెల్టా వేరియంట్లపై పని చేస్తున్నప్పటికీ సమర్థత తక్కువగా ఉన్నట్లు పలు అధ్యయానాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రెండు డోసులు తీసుకుంటేనే అధిక ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపాయి. బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం కరోనా టీకాలు డెల్టా వేరియంట్ల నుంచి 96 శాతం రక్షణ కల్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరే ముప్పును 79 శాతం తగ్గిస్తున్నాయని వెల్లడైంది. అయితే సింగిల్ డోసు తీసుకుంటే మాత్రం కేవలం 35శాతం రక్షణే లభిస్తున్నట్లు తేలింది.