ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోయి స్వతంత్రంగా దేశంగా మారిన బ్రిటన్.. భారత్ను కీలక వాణిజ్య భాగస్వామిగా చేసుకోవాలని యోచిస్తుంది. అయితే భారత్ను వాణిజ్య భాగస్వామిగానే కాకుండా.. ప్రత్యర్థిగాను చూడాలని పేర్కొంది అంతర్జాతీయ వ్యవహారాలను అంచనా వేసే చాతమ్హౌస్(రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నెషనల్ అఫైర్స్) సంస్థ. ఈ మేరకు 'గ్లోబల్ బ్రిటన్, గ్లోబల్ బ్రోకర్: బ్రిటన్ భవిష్యత్- అంతర్జాతీయ పాత్ర' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోని ఉదార ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానించి గ్లోబల్ బ్రోకర్గా అవతరించడానికి, అలాగే ఈయూ సభ్య దేశాలతో సహా అమెరికాతో సంబంధాలు కొనసాగించడంపై బ్రిటన్ దృష్టి సారించిందని చాతమ్హౌస్ పేర్కొంది.
బ్రిటన్ లక్ష్యాల విషయంలో విభేదాలు
"చైనా నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా ఆసియా- పసిఫక్ ప్రాంతంలోని ప్రజాస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలు.. అమెరికా-బ్రిటిష్ కూటమిలో భాగంగా ఉన్నాయి. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం చైనా, భారత్, సౌదీ అరేబియా టర్కీ వంటి దేశాలతో లోతైనా సంబంధాల కోసం బ్రిటన్ ప్రయత్నిస్తోంది. దీనివల్ల 'గ్లోబల్ బ్రిటన్' లక్ష్యాల విషయంలో విభేదాలు వచ్చే అవకాశముంది" అని చాతమ్హౌస్ హెచ్చరించింది.
అలా ఉండటం కష్టమే
"బ్రిటన్.. భారత్తో కీలక సంబంధాలు కుదుర్చుకోకుండా ఉండటం కష్టమే. ఎందుకంటే.. సమీప భవిష్యత్లో జనాభా పరంగా అతిపెద్ద దేశంగా భారత్ అవతరించనుంది. ఆర్థికంగానూ ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది. రక్షణ వ్యవస్థలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టనుంది" అని చాతమ్ పేర్కొంది. అయితే చరిత్రను దృష్టిలో ఉంచుకుని భారత్తో సంబంధాల విషయంలో బ్రిటన్ జాగ్రత్త వహించాలని సూచించింది.
భారత్ తీరు
"గతంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అలీన ఉద్యమానికి నాయకత్వం వహించింది భారత్. 2017లో అధికారికంగా చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థలో చేరింది." నివేదికలో ప్రస్తావించింది.
అందుకే భవిష్యత్లో బ్రిటన్కు భారత్తో దౌత్య, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవచ్చని చాతమ్ పేర్కొంది.
భారత్లో సవాళ్లు
భారత్లోని సంక్లిష్ట రాజకీయాలను కూడా ఈ నివేదికలో ప్రస్తావించింది చాతమ్. స్వేచ్ఛా వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల నిరోధక దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని పేర్కొంది. భారత్ గురించి కొన్ని గ్రూపులతో పాటు ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రజాస్వామ్య పరిశీలకులు లేవనెత్తిన ఆందోళనలను గురించి పేర్కొంది.
గ్లోబల్ బ్రోకర్గా ఎదగాలంటే..
"బ్రిటన్.. గ్లోబల్ బ్రోకర్గా ఎదగాలంటే ఉదార ప్రజాస్వామ్య దేశాలను రక్షించే లేదా మద్దతు గ్రూపులో ప్రముఖ సభ్య దేశంగా ఉండాలి. నియమాల ఆధారిత అంతర్జాతీయ సహకారానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్య, ప్రజాస్వామ్యేతర దేశాలను అనుసంధానం చేసి, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకోవడానికి సాధ్యపడవచ్చు" అని పేర్కొంది చాతమ్.
ఇదీ చూడండి: ఆఫ్రికాలో ఉగ్రవాదంపై భారత్ ఆందోళన స్వరం