Urban Forestry Scheme : ప్రస్తుతం ప్రపంచం ఉరుకుల పరుగుల జీవితంలో జీవిస్తోంది. దీంతో చిన్న ఆనందాలను, ప్రకృతితో మమేకమయ్యే పరిస్థితిని ప్రజలు కోల్పోతున్నారు. కాంక్రీటులోనే జీవితాన్ని గడిపేస్తూ కాలుష్యంలో చిక్కుకుంటున్నారు. ఉదయం లేస్తే చాలు పని అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లిపోవడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి 4 గోడల మధ్యనే జీవిస్తున్నారు. దీంతో బయటి ప్రపంచంతో సంబంధం అనేది లేకుండా పోయి, జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలాంటి వారి కోసం చర్యలకు దిగి ఓ పథకాన్ని ప్రారంభించింది.
కనీసం సెలవు రోజుల్లోనైనా కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా గడిపేలా నగర వన యోజన పథకం తీసుకొచ్చింది. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం పరిధి అక్కన్నపేట అటవీ ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేయనున్నారు. రామాయంపేట పురపాలికకు సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద రూ.2 కోట్లతో అర్బన్ పార్కు నిర్మాణాన్ని చేపడుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా, అక్కన్నపేట బీట్ పరిధిలో సుమారు 550 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 50 హెక్టార్ల పరిధిలో పార్కును నిర్మించి తాత్కాలిక రుసుంతో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో కాంక్రీట్ జీవితం నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
వాహనాలు తిరిగేలా రోడ్ల నిర్మాణం : సుమారు 125 ఎకరాల్లో అర్బన్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించగా, ఇందులో రహదారి వైపు గేటు ఏర్పాటు చేసి 2.5 కిలోమీటర్ల మేర చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయనున్నారు. 2.5 కిలోమీటర్ల వరకు అటవీ ప్రాంతంలోకి వాహనాలు వెళ్లేలా మట్టి రోడ్డును నిర్మించనున్నారు. 50 హెక్టార్లలో అటవీ ప్రాంతం చుట్టి రావడానికి రహదారిని సైతం ఏర్పాటు చేస్తున్నారు. లోపల చెక్డ్యాంలు, నీటి కుంటలు, రాళ్లతొట్టెలు వంటివి ఏర్పరచనున్నారు. మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయగా, ఇందులో సోలార్, సీసీ కెమెరాలు సెట్ చేయనున్నారు.
అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు ప్రాణం : ప్రస్తుతం భూమి మీద అంతరించిపోతున్న ఔషధ మెక్కలను ఐదు ఎకరాల్లో నాటి, వాటి సంరక్షణను చూసుకోనున్నారు. జీవ వైవిధ్య మొక్కలు, నక్షత్ర వనం ఏర్పాటు కానుంది. చిన్నారులు ఆడుకునేందుకు ఆట పరికరాలు, సేద తీరేందుకు బల్లలు వంటివి ఏర్పాటు చేయనున్నారు. అటవీ ప్రాంతం మొత్తాన్ని వీక్షించడానికి సుమారు 50 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ నిర్మాణం కానుంది.
ఎక్స్పీరియం పార్కు - నగరవాసులకు ఇది ఎంతో ప్రత్యేకం
డైనోసార్లు, ఆదిమానవులు, ఇంకా మరెన్నో - ఈ పార్కుకు వెళితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు!