ఫిలిప్పీన్స్వైపు భీకర కమ్మురి తుపాను దూసుకొస్తోంది. నేటి ఆర్ధరాత్రి లేదా రేపు ఉదయం లుజాన్ ద్వీపంలో తుపాను తీరం దాటే అవకాశముందని ఆ దేశ వాతావరణశాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఈదురుగాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి.
తుపాను నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లుజాన్ ద్వీపంలోని వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. ఆహారపదార్థాలు సహా ఇతర నిత్యావసరాలను ఏర్పాటు చేసింది. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు.
సముద్ర ప్రయాణాన్ని ఆపివేశారు. ఫలితాంగా పోర్టుల్లోనే అనేక మంది ప్రజలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
30వ ఆగ్నేయాసియా క్రీడలకు ఫిలిప్పీన్స్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో ఈ తుపాను భయం ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ పోటీల్లోని పలు క్రీడలను ఇప్పటికే వాయిదా వేశారు.