ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని ఓ ఐస్ ప్లాంట్ నుంచి అమ్మోనియా వాయువు లీక్ అయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఫాక్టరీ ఉద్యోగులు సహా 90 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనతో ఫ్యాక్టరీ సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారందరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో 20 మందికిపైగా శ్వాసతీస్కోవడంలో ఇబ్బందులు, కళ్లు, చర్మ సంబంధి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
గ్యాస్ లీకేజీకి కారణమైన ఫ్యాక్టరీని అధికారులు మూసివేశారు. అదనపు సురక్షిత చర్యలు, ఇతర అన్ని విభాగాల్లో రక్షణ సదుపాయాలను పరీక్షించేంత వరకు ఫ్యాక్టరీని తెరవొద్దని ఆదేశించారు.
ఈ ఘటనపై నవోటస్ నగర మేయర్ టోబి టియాంగ్కో.. బాధితులకు క్షమాపణలు చెప్పారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కంపెనీనే బాధితులకు కావాల్సిన వైద్య ఖర్చులను భరించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:మయన్మార్లో ఫేస్బుక్ బంద్- నిరసనలు తీవ్రం