అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్కు కష్టాలు వీడే అవకాశం కనిపించటం లేదు. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడుతుందనే కారణంతో పాకిస్థాన్ను గ్రే జాబితాలో చేర్చిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్).. పాక్ను జూన్ వరకు అదే జాబితాలో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ, వర్కింగ్ గ్రూప్ సమావేశం ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 26 మధ్య పారిస్లో జరగనుంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఎఫ్ఏటీఎఫ్.. పాకిస్థాన్ను 2018 జూన్లో గ్రే జాబితాలో చేర్చింది. నిర్దేశిత గడువులోగా 27 సూత్రాల కార్యాచరణను పాటించాలని తెలిపింది. అయితే ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన 6 కీలక విధులను నిర్వర్తించడంలో ఇమ్రాన్ఖాన్ సర్కారు విఫలమైంది. దాంతో అక్టోబర్లో జరిగిన సమావేశంలో 2021 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే పాకిస్థాన్ ఉంటుందని నిర్ణయించింది.
మద్దతు కోసం..
ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులపై పాకిస్థాన్ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్లీనరీ సమావేశానికి ముందు.. ఎఫ్ఏటీఎఫ్ సభ్యదేశాల మద్దతును కూడగట్టేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తోంది. తమ దేశానికి వచ్చి, పరిస్థితులను పరిశీలించాలని కోరుతోంది. ఈ చర్యల ఫలితంగా.. ఈ ఏడాది జూన్ నాటికి గ్రేలిస్ట్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని పాకిస్థాన్ అధికార వర్గాలు తెలిపాయి.
గ్రేలిస్టు నుంచి వైట్ లిస్టులోకి వచ్చేందుకు పాకిస్థాన్కు.. 39 మంది సభ్యులు ఉన్న ఎఫ్ఏటీఎఫ్లో 12 సభ్యుల ఓట్లు కావాల్సి ఉంటుంది.