పాకిస్థాన్లో కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. చైనాకు చెందిన బీజింగ్ బయోటెక్నాలజీ సంస్థతో కలిసి కాన్సినో బయో సంస్థ.. ఈ టీకాను తయారు చేసింది. పాకిస్థాన్ జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం వ్యాక్సిన్ రెండు దశల ప్రయోగాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాకే, మూడోదశ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ.
ప్రయోగంలో పాల్గొంటే రూ. 50,000/-
మార్చ్ 24న పాక్ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫయాద్ చౌదరి వ్యాక్సిన్ తయారీ కోసం... 'కొవిడ్-19 సైంటిఫిక్ టాస్క్ ఫోర్స్' పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పడు మూడో దశ ప్రయోగం కోసం కరాచీ నుంచి 18 ఏళ్లు పైబడిన సుమారు 200 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వ్యాక్సిన్ ప్రయోగంలో పాల్గొన్నందుకు ఒక్కో వలంటీర్కు రూ. 50,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు కమిటీలోని ఓ అధికారి.
దాదాపు 56 రోజులపాటు కొనసాగే ఈ ప్రయోగంలో.. ఒక్కో వ్యక్తికి మూడు డోసులిచ్చి అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటోంది పాక్ జాతీయ ఆరోగ్య సంస్థ.
ఇదీ చదవండి: కరోనాపై పోరు కోసం భారత్కు బ్రిటన్ 30కోట్ల నిధి