పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దులను అతిక్రమించి భారత్లోకి అక్రమంగా చొరబడుతుండడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సరికొత్త భాష్యం చెప్పారు. అధికరణ 370 రద్దు తరువాత కశ్మీరీలకు మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు సరిహద్దులు దాటి వెళ్తున్నవారిపై భారత్ ఇస్లామిక్ ఉగ్రవాదులనే ముద్ర వేస్తోందని ఆరోపించారు. అందువల్ల పాక్ ఆక్రమిత కశ్మీరీలు ఎవ్వరూ నియంత్రణరేఖ దాటి వెళ్లొద్దని ఇమ్రాన్ఖాన్ విజ్ఞప్తి చేశారు.
"జమ్ముకశ్మీర్లోని తమ తోటి కశ్మీరీలను చూసి పీఓకే కశ్మీరీలు పడుతున్న ఆవేదన నాకు అర్థమవుతోంది. కశ్మీరీలకు సహాయం చేసేందుకు మానవతా దృక్పథంతో మీరెవరూ సరిహద్దులు దాటవద్దు. అలా దాటినవాళ్లను భారత్.. ఇస్లామిక్ ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది."
- ఇమ్రాన్ఖాన్, పాక్ ప్రధాని ట్వీట్పీఓకే కశ్మీరీలు నియంత్రణరేఖ దాటొద్దు: ఇమ్రాన్ ట్వీట్
జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పిలుపు మేరకు వేలాది మంది పీఓకే కశ్మీరీలు మోటారు వాహనాలతో ముజఫరాబాద్ వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సరిహద్దులు దాటవద్దని వారికి ప్రధాని సలహా ఇచ్చారని డాన్ పత్రిక తెలిపింది.
రగడ ఇలా మొదలైంది..
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని ఆగస్టు 5న భారత పార్లమెంటు రద్దు చేసింది. దీనిని పాకిస్థాన్ వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే కశ్మీర్.. తమ అంతర్గత అంశమని భారత్ ప్రపంచానికి తేల్చి చెప్పింది. ఇంతకు ముందు భారత్పై జిహాద్ చేయాలని ఇమ్రాన్ఖాన్ ప్రకటించడాన్నీ భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రధాని హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆసహనం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: మోదీతో హసీనా భేటీ- రక్షణ సహా వివిధ అంశాలపై చర్చ