ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్తో పాటు అతని ముగ్గురు అనుచరులకు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. జమాత్ ఉద్ దవా సంస్థ కార్యకలాపాల కోసం ప్రభుత్వ భూమిని అక్రమంగా వినియోగిస్తున్నారన్నది అభియోగం. ఈ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా జేయూడీ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టుకు సయీద్ తరఫు న్యాయవాది తెలిపారు. బెయిల్ పిటిషన్ అంగీకరించాలని కోరారు. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఆగస్టు 31 వరకూ అరెస్ట్ చేయకుండా లాహోర్లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
జేయూడీ సంస్థల సీజ్..
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితో జేయూడీ, ఎల్ఈటీ, ఎఫ్ఐఎఫ్ సంస్థలపై పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత మార్చిలో జేయూడీకి సంబంధించిన 160 శిక్షణ శిబిరాలు, 32 పాఠశాలలు, రెండు కళాశాలలు, నాలుగు ఆసుపత్రులు, 178 అంబులెన్సులు, 153 మందుల దుకాణాలను ప్రభుత్వం సీజ్ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
ఉగ్రవాద నిధుల సమీకరణ, అక్రమ నగదు బదిలీ కేసులను సవాలు చేస్తూ సయీద్ దాఖలు చేసిన పిటిషన్పై లాహోర్ హైకోర్టు విచారణ చేపట్టింది. సమాధానం ఇవ్వాలని కోరుతూ పాక్ సర్కారు, పంజాబ్ ప్రభుత్వం, తీవ్రవాద వ్యతిరేక విభాగానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జులై 30కి తీర్పు వాయిదా వేసింది.
23 కేసులు...
పంజాబ్కు చెందిన తీవ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడీ) జులై 3న ఉగ్రవాద నిధుల సమీకరణపై హఫీజ్ సయీద్తో పాటు 13 మంది జేయూడీ నాయకులపై 23 కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సవాలు చేస్తూ గత శుక్రవారం లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సయీద్.
ఇదీ చూడండి: పాకిస్థాన్కు 597 కోట్ల డాలర్ల జరిమానా..!