ఆస్ట్రేలియాలో తప్పనిసరి కానున్న.. 'పే ఫర్ జర్నలిజం'లో భాగంగా గూగుల్తో ఒప్పదం కుదుర్చుకున్న అతిపెద్ద మీడియా సంస్థగా సెవెన్ వెస్ట్ మీడియా నిలిచింది. దీనికి సంబంధించిన ముసాయిదా మంగళవారం పార్లమెంట్ ముందుకు వెళ్లనుండగా.. సోమవారమే ఈ ఒప్పదంపై గూగుల్, సెవెన్ వెస్ట్ మీడియా సంయుక్త ప్రకటన చేశాయి.
ఈ ఒప్పందం విలువ ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. మరో మీడియా సంస్థ నైన్ ఎంటర్టైన్మెంట్ ఆ ఒప్పందం విలువ ఏడాదికి 30 ఆస్ట్రేలియన్ మిలియన్ డాలర్లుగా పేర్కొంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మీడియా సంస్థల అధికారుల మధ్య తాజాగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.
ఏమిటి ఈ పే ఫర్ జర్నలిజం?
గూగుల్, ఫేస్బుక్లు తమ ప్లాట్ఫామ్లపై చూపించే వార్తలకు గానూ సంబంధిత వార్తా సంస్థకు డబ్బు చెల్లించాలనేదే ఈ పే ఫర్ జర్నలిజం. గత ఏడాది ఈ ప్రతిపాదనను ఆయా సంస్థల ముందుకు తీసుకొచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. దీనిని తమ దేశంలో తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఈ విధంగా జర్నలిజంకు డబ్బులు అందించేందుకు చట్టం రూపొందించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.
కొత్త ప్రతిపాదనపై గూగుల్, ఫేస్బుక్లు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశాయి. డబ్బులు చెల్లించే బదులు.. ఆస్ట్రేలియా వార్తల కంటెంట్ను నిషేధిస్తామని ఎఫ్బీ హెచ్చరించింది. ఈ ప్రతిపాదిత చట్టానికి ఆమోదం లభిస్తే.. గూగుల్ సెర్చ్తో పాటు యూట్యూబ్ సేవలు ఆధ్వానంగా ఉంటాయని తేల్చిచెప్పింది గూగుల్. అయితే తాజా చర్చల అనంతరం ఈ చట్టాలనికి ఇరు సంస్థలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గూగుల్ న్యూస్ షోకేస్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 450 చిన్న చిన్న సంస్థలతో చెల్లింపు ఒప్పందం కుదుర్చుకుంది.
ఇవీ చదవండి:'అలా చేస్తే గూగుల్ సేవలను నిలిపేస్తాం'