ఇరాక్లో మూడు రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు మరణించిన నిరసనకారుల సంఖ్య 18కి చేరింది. ఓ పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
రాజధాని బాగ్దాద్లో ఆందోళనలు నిర్వహించరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే నిరసనకారులు ప్రభుత్వ హెచ్చరికల్ని బేఖాతరు చేశారు. ఫలితంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
తెహ్రీర్ స్క్వేర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. బాగ్దాద్ నుంచి తెహ్రీర్ చేరుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
అవినీతి, నిరుద్యోగ సమస్యతో విసుగుచెందిన ప్రజలు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నాయకుడే లేని ఈ ఆందోళనలు దక్షిణ ఇరాక్ అంతా వ్యాపించాయి. పరిస్థితులు ప్రధాని అదెల్ అబ్దేల్ మహదీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
ఇదీ చూడండి: ఆ నగరంలో ట్రాఫిక్ జామ్ అయితే ఆనందమే!