దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అతి సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన పేలుడులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ దాడికి ఇరాన్కు సంబంధమున్నట్లు గుర్తించారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్, సగం కాలిపోయిన గులాబీరంగు స్కార్ఫ్, ఇజ్రాయెల్ రాయబారి చిరునామాతో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ లేఖలో దివంగత ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ, ఇరాన్ దివంగత అణుశాస్త్రవేత్త మొసిన్ ఫక్రజా పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 12 గజాల దూరంలో ఈ లేఖను అధికారులు గుర్తించారు. ఈ స్వల్ప పేలుడు.. పెద్ద కుట్రకు సన్నాహకం కావచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఆ ఇద్దరు ఎవరు?
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు జరిగిన ప్రాంతంలో.. ఇద్దరు వ్యక్తులను ఓ క్యాబ్ దింపినట్లు సీసీ టీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. వారికి ఈ పేలుడుతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ను గుర్తించిన దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం.. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీసింది. క్యాబ్ డ్రైవర్ సాయంతో ఆ ఇద్దరు వ్యక్తుల చిత్రాలను గీయించారు.
భద్రత కట్టుదిట్టం..
దేశ రాజధానిలో పేలుడు ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, ప్రభుత్వ భవనాల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రముఖ సంస్థల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కేంద్ర పారిశ్రమల భద్రతా దళం వెల్లడించింది. భయాందోళనలు, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దిల్లీలో పేలుడు ఘటన తర్వాత పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఇదీ చదవండి:యూఏఈలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం