అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించాలని అగ్రరాజ్యం కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థికసలహాదారు పీటర్ నవారో అన్నారు.
సుంకాల మహారాజు
శ్వేతసౌధం వాణిజ్యం, తయారీ పాలసీకి నేతృత్వం వహిస్తున్న నవారో.. ఓ టీవీ ఛానల్ ముఖాముఖిలో భారత పన్నుల విధానంపై మాట్లాడారు. భారత ఉత్పత్తులపై అమెరికా వసూలు చేస్తున్న సుంకాల కంటే.. 90 శాతం అధికంగా తమ ఉత్పత్తులపై ఇండియా సుంకాలు విధిస్తోందని అన్నారు. ఈ అధిక సుంకాలను తగ్గించి, పరస్పర ఆరోగ్యకరమైన వాణిజ్యానికి తోడ్పడాలని నవారో కోరారు.
"మేము భారత్లో వాణిజ్యం చేస్తున్నాం. నేను సరదాగా అంటున్నా.. 'భారతదేశం సుంకాల మహారాజు'. విదేశీ ఉత్పత్తులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశం భారత్. ఇది హాస్యాస్పదం."- పీటర్ నవారో, శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థిక సలహాదారు
మేమూ సుంకాలు పెంచుతాం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'పరస్పర వాణిజ్య చట్టానికి' పెద్ద అభిమాని అని నవారో తెలిపారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించకపోతే.. ఆయా దేశాల ఉత్పత్తులపై అమెరికా కూడా సుంకాలు పెంచేందుకు ఇది వీలుకల్పిస్తుంది అని ఆయన అన్నారు.
టారిఫ్ కింగ్
ట్రంప్ కూడా భారత్ను పదేపదే 'టారిఫ్ కింగ్'గా అభివర్ణిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విపరీతంగా అధిక సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: ముగిసిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం