గూఢచర్యం ఆరోపణలతో 544 రోజులు బందీకానాలో ఉన్న వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయునికి, అతని కుటుంబానికి ఇరాన్ 180 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది యూఎస్ ఫెడరల్ కోర్టు.
ఇరాన్పై దావా..
వాషింగ్టన్ పోస్టు పాత్రికేయుడు జాసన్ రెజియాన్ ఇరాన్ తనపై భౌతిక దాడులకు పాల్పడిందని, హింసకు గురిచేసిందని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. దీనిపై యూఎస్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ జె లియాన్ తాజాగా తీర్పు వెలువరించారు. ఇరాన్ అధికారులు.. బందీగా ఉన్న రేయాన్ను నిద్రపోకుండా చేశారని, శారీరక హింసకు పాల్పడ్డారని, అతని ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. ఇరాన్ది పూర్తిగా శిక్షార్హమైన నేరమని ఆయన వ్యాఖ్యానించారు.
"ఇరాన్... జాసన్ను నిర్బంధించింది. చంపేస్తామని బెదిరించింది. అమెరికాలోని ఇరాన్ ఖైదీలను విడిపించుకునేందుకు.. జాసన్ను బేరానికి పెట్టింది."
- రిచర్డ్ జె లియాన్, యూఎస్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి
స్పందించని ఇరాన్
న్యాయస్థానం తీర్పుపై ఇరాన్ రాయబార కార్యాలయం ప్రతిస్పందించలేదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇరాన్ మిషన్ కూడా దీనిపై స్పందించలేదు. మరోవైపు జాసన్, అతని న్యాయవాది కూడా తీర్పుపై మౌనం వహించారు.
2014లో మొదలైంది..
ఇరాన్లో పనిచేస్తున్న జాసన్ను, అతని భార్య యెగనే సలేహిలను గూఢచర్యం ఆరోపణలపై 2014లో ఇరాన్ అధికారులు బంధించారు. తెహ్రాన్లోని ఎవిన్ జైలులో వారిని ఉంచి, చిత్రహింసలకు పాల్పడ్డారు. అమెరికాలోని తమ దేశ ఖైదీలను విడిపించుకునేందుకు జేసన్ను బేరానికి ఉంచారు. ఈ చర్యను మానవహక్కుల సంఘాలు, అమెరికా తీవ్రంగా ఖండించాయి. ఒత్తిడి పెరగడం వల్ల ఇరాన్... జాసన్ దంపతులను నిర్దోషులుగా విడుదల చేసింది.
ఇదీ చూడండి: ఎన్సీపీ ఎప్పుడూ భాజపాతో చేతులు కలపదు: పవార్