ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే కోటిన్నర మందికి సోకిన ఈ వైరస్ 6 లక్షల 30 వేల మంది ప్రాణాలు తీసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ కేసులు నమోదతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ తొలిమూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ దేశాల్లో నిత్యం దాదాపు 50వేల పాజిటివ్ కేసుల చొప్పున బయటపడుతున్నాయి. అయితే, కొవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ మూడు దేశాలకు వైరస్ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.
శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రెజిల్, భారత్కు ఈ మహమ్మారిని ఎదుర్కొనే అత్యంత అంతర్గత సామర్థ్యాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని దీటుగా ఎదుర్కొంటాయని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో గంటకు 2600 కేసులు..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతి గంటకు దాదాపు 2600 పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ఇప్పటికే 40లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్లో 22లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 84వేల మంది మృత్యువాతపడ్డారు.
భారత్లో గురువారం ఒక్కరోజే 49,000 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12లక్షల 87వేలకు చేరగా మరణాల సంఖ్య 30వేలు దాటింది.
ఇదీ చూడండి:వరద నీటిలో సెల్ఫీ కోసం బాలికల దుస్సాహసం