అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై సెనేట్లో ఫిబ్రవరి 8 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ మేరకు మెజార్టీ నేత చక్ షుమర్ తెలిపారు. ఈ అభిశంసన ఆర్టికల్ను ఈనెల25న సాయంత్రం సెనేట్లో హౌస్ మేనేజర్లు చదువుతారని ఆయన తెలిపారు. అనంతరం దీనిపై న్యాయపరమైన ఆధారాలను సమర్పించడానికి హౌస్ మేనేజర్లతో పాటు, ప్రతివాదులకు సమయం ఇస్తారని చెప్పారు.
ఆధారాలు సమర్పించిన అనంతరం దీనిపై ఫిబ్రవరి 8నుంచి పూర్తిస్థాయి విచారణ ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పటికే సెనేట్కు అభిశంసన ఆర్టికల్ను ఈ నెల 25న పంపిస్తున్నట్లు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించారు. ప్రస్తుతం డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీలు సెనేట్లో 50 సీట్లతో సమానంగా ఉన్నాయి. అయితే.. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ వేసే ఓటు ఈ అభిశంసనలో కీలకం కానుంది.
ఈ అభిశంసన ప్రక్రియతో పాటు ఇతర కార్యకలాపాలు ఏకకాలంలో జరుగుతాయని శ్వేతసౌధ కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 6న జరిగిన క్యాపిటల్ హింసాకాండలో తన మద్దతుదారులను ట్రంప్ ప్రేరేపించారన్న ఆరోపణలతో డెమొక్రాట్లు మాజీ అధ్యక్షుడిపై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించారు.
ఇదీ చూడండి:అమెరికా రక్షణ మంత్రిగా తొలిసారి నల్లజాతీయుడు