ఇరాన్పై మరోసారి కఠిన ఆంక్షలు విధించింది అమెరికా. సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై దాడి చేసినందుకే ఈ నూతన ఆంక్షలు విధిస్తున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అలాగే వీటిని ఒక దేశంపై అమెరికా విధించిన అత్యంత కఠిన ఆంక్షలుగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్తో సమావేశం అనంతరం ఇరాన్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇరాన్ జాతీయ బ్యాంకుపై ఆంక్షలు విధించి.. అన్ని రకాల నిధుల రాకను మూసివేశామని అగ్రరాజ్య అధికారి ఒకరు వెల్లడించారు.
అమెరికా ఆరోపణలను ఖండించిన ఇరాన్..
సౌదీ అరేబియాపై దాడి ఆరోపణలను కొట్టిపారేసింది ఇరాన్. ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అలాగే అమెరికా తమపై చేస్తున్న ఆరోపణలు ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలను పెంచుతాయని ఆందోళనలు వ్యక్తం చేసింది.
2015లో అణు ఒప్పందాన్ని ఇరాన్ నిరాకరించినప్పటి నుంచి ఆ దేశంపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది అగ్రరాజ్యం. తాజా ఆంక్షలు ఒత్తిడి కొనసాగింపు దిశగానే చేసినట్లు అమెరికా వెల్లడించింది.