CM Revanth Reddy on Krishna Water : శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణ జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రద్రేశ్ నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని అన్నారు. టెలీమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావటం లేదని అధికారులు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
టెలీమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందన్న సీఎం వెంటనే టెలీమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే ఉందని, నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్న సీఎం ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయమై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి : రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులు రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా పరిష్కార మార్గాలు అనుసరించాలని, రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నీటి విడుదల తీరును కలెక్టర్ల స్వయంగా పరిశీలించాలి : ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగు, తాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగు, సాగునీటిని అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. కలెక్టర్లు వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని, ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్ల స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకొని అన్ని సీఎస్ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని అన్నారు.
కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు