హైతీలో జైలు గోడలు బద్దలు కొట్టుకొని ఏకంగా 400 మంది ఖైదీలు పారిపోయారు. ఈ క్రమంలో మరో 25 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. దశాబ్ద కాలంలో ఇంత మంది ఖైదీలు తప్పించుకోవడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. పరారైన నిందితుల్లో 60 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.
ఎందుకు తప్పించుకున్నారు?
అనేక అత్యాచారాలు, దారుణాలకు పాల్పడ్డ అర్నెల్ జోసెఫ్ అనే గ్యాంగ్స్టర్ను విడుదల చేయడానికి క్రోయిక్స్ దెస్ బాంకెట్ జైలు గోడల్ని ఖైదీలు బద్దలు కొట్టినట్లు కొందరు తెలిపారు. కాగా జోసెఫ్ తప్పించుకున్న మరుసటి రోజు (ఫిబ్రవరి 26, శుక్రవారం)న బైక్పై వెళుతూ పోలీసులకు దొరికాడు. ఈ క్రమంలో అతను పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులూ అతనిపై ఎదురుకాల్పులు జరిపారు. దాంతో జోసెఫ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జోసెఫ్ను 2019లో పోలీసులు అరెస్టు చేశారు.
జైలు గోడలు బద్దలు కొట్టిన ఘటనపై పోలీసులు ఇతర వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ ఘటనను ఖండిస్తూ ఆ దేశ అధ్యక్షులు జోవేనల్ మోయిస్సే ట్వీట్ చేశారు. వీలైనంత త్వరగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావలని ఆదేశించారు.
ఐరాసలోని హైతీ ప్రత్యేక ప్రతినిధి హెలేనా లా లిమా.. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా భద్రతను పెంచాలని పోలీసులను కోరారు. అంతేకాకుండా తప్పించుకుపోయిన ఖైదీలను వీలైనంత త్వరగా పట్టుకోవాలన్నారు.
హైతీలో పలు మార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. 2014లోనూ ఖైదీలు జైలు గోడల్ని బద్దలు కొట్టి దాదాపు 300 మందికి పైగా ఖైదీలు తప్పించుకుపోయారు. అప్పట్లో క్లిఫర్డ్ బ్రాండంట్ అనే ఖైదీని తప్పించడం కోసం ఖైదీలు జైలు గోడలు బద్దలు కొట్టినట్లు చెబుతారు.
ఇదీ చూడండి: 'మయన్మార్లో పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది'