ఇటీవల వర్చువల్గా జరిగిన చతుర్భుజ కూటమి(క్వాడ్) దేశాల సమావేశాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు అమెరికా దౌత్యవేత్త అతుల్ కేశప్. క్వాడ్ దేశాలు తమ శక్తియుక్తుల్ని పెంచుకోవడానికి తగిన భరోసాను ఈ సదస్సు కలుగజేసిందని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సహకారం అవసరమని నొక్కి చెప్పిందని పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వంలో తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోని వ్యవహారాలను పర్యవేక్షించే ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అతుల్ కేశప్.. పెర్త్ యూఎస్ ఆసియా సెంటర్ అండ్ యూఎస్ స్టడీ సెంటర్ మంగళవారం నిర్వహించిన కాన్ఫరెన్స్లో వర్చువల్గా ప్రసంగించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కూడిన ఈ క్వాడ్ కూటమి సదస్సు శుక్రవారం జరిగింది. 2007లో ఈ కూటమి ఏర్పాటు కాగా.. తొలిసారి దేశాధినేతల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సమానత్వం కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ భేటీలో నేతలంతా ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై అందరికీ హక్కుందని ఉద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా రకరకాల యత్నాలు, దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఏర్పడింది.
ఇదీ చదవండి: 'ఇండో-పసిఫిక్లో శాంతి, సుస్థిరతకు క్వాడ్ కీలక పాత్ర'