కరోనా గురించి చైనాకు గతేడాది నవంబరు నాటికే తెలిసి ఉండవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. అయితే వైరస్ విషయంలో బీజింగ్ పారదర్శకంగా వ్యవహరించలేదని ఆరోపించారు.
"వైరస్ను త్వరగా గుర్తించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ విఫలమయ్యారు. ఇప్పటికే అమెరికా ప్రజలపై వైరస్ ప్రభావం అధికంగా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ నుంచి సార్స్-కొవిడ్-2 నమూనాతో సహా చైనా నుంచి మరింత సమాచారాన్ని అమెరికా కోరుకుంటోంది. ఈ సమాచారం గతేడాది చివర్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికే కాదు... ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
సమాచారాన్ని దాచి పెట్టింది!
కరోనా సమాచారాన్ని రహస్యంగా తన దగ్గర ఉంచుకుని, వైరస్ను చైనా అదుపు చేసుకుందని ఆరోపించారు పాంపియో. మహమ్మారిగా మారిన వైరస్ను డిసెంబర్ 31న నిమోనియా కేసులుగా వుహాన్ అధికారులు నివేదించారని పేర్కొన్నారు. ఈ వైరస్ వుహాన్లోని వైరాలజీ ప్రయోగశాలలో ఉద్భవించిందని, దీనిని ప్రపంచ దేశాలు అంగీకరించాలన్నారు పాంపియో.
ఇదీ చూడండి: 'కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం'