ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు పైగా కరోనా టీకాలను పంపిణీ చేస్తూ.. వాక్సిన్ ఈక్విటీ కార్యక్రమానికి మద్దతునిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ప్రశంసించారు. ఈ అంశంలో ప్రపంచ దేశాలు మోదీ మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ట్విట్టిర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
పేద దేశాలకు కరోనా టీకా అందించేందుకు ఐరాస ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రపంచ కూటమి 'కొవాక్స్'.. ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా వాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో వాక్సిన్ ఈక్విటీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కార్యక్రమానికి భారత్ తనవంతు సహకారాన్ని అందించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా-సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఉత్పత్తైన టీకాలను పశ్చిమాఫ్రికా దేశమైన 'ఘనా'కు యూనిసెఫ్ సహకారంతో ఇటీవల 6లక్షల డోసులను సరఫరా చేసింది.
కరోనా టీకాలను భారత్ తన సహచర దేశాలైన బంగ్లాదేశ్కు 20లక్షలు, మయన్మార్కు 17 లక్షలు, నేపాల్కు 10, భూటాన్కు 1.5 లక్షలు, మాల్దీపులకు లక్ష, మారిషస్కు 1లక్ష, శ్రీలంకకు 5లక్షలు, బహ్రెయిన్కు 1లక్ష, యెమెన్కు 1లక్ష, అఫ్గానిస్థాన్కు 5లక్షలు, డొమనికాకు70,000 చొప్పున ఉచితంగానే అందించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.
బ్రెజిల్కు 20లక్షలు, మొరాకోకు 60లక్షలు, బంగ్లాదేశ్కు 50లక్షలు, మయన్మార్కు 20లక్షలు, ఈజిప్టుకు 50వేలు, దక్షిణాఫ్రికాకు 10లక్షలు, కువైట్కు 2లక్షలు, యూఏఈకి 2లక్షల చొప్పున వాణిజ్య పరంగా విక్రయించామని అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
ఇదీ చదవండి:భారత్-పాక్ ప్రకటనపై ఐరాస హర్షం