అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుగా సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం తాలిబన్లు ఒక అడుగు ముందుకేశారు. కాల్పుల విరమణ ఎంతకాలమన్న విషయమై స్పష్టత లేదు. కనీసం 10 రోజులపాటు తుపాకులు మోగబోవని తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి. 2018 జూన్లో రంజాన్ సందర్భంగా మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటించారు. ఈసారి ఈ గడువు పెంచడం ఒకింత ఊరట కలిగించే అంశం. అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడం, అఫ్గాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తిపలకడం శాంతి ఒప్పందం లక్ష్యం.
నష్టపోయిన అమెరికా
ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే లక్ష్యంతో 18 ఏళ్ల క్రితం అమెరికా సైన్యం అఫ్గాన్లో అడుగుపెట్టింది. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా తీవ్రరూపం దాల్చింది. ఏళ్ల తరబడి సైన్యం కొనసాగింపు వల్ల అమెరికా ఆర్థికంగా, సైనికపరంగా నష్టపోయింది. ఉగ్రదాడుల్లో అనేకమంది సైనికులూ హతులయ్యారు. దీంతో ఈ యుద్ధం అసలు ఎవరి కోసమన్న అంతర్మథనం ప్రారంభమైంది. దళాల ఉపసంహరణకు ఒబామా హయాములోనే ప్రయత్నాలు జరిగినప్పటికీ కొలిక్కిరాలేదు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫ్గాన్ నుంచి దళాల ఉపసంహరణను తన ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేకంగా ప్రకటించారు. అయితే పదవీకాలం ముగుస్తున్నా ఆ దిశగా విజయవంతం కాలేకపోయారు.
గందరగోళ పరిస్థితుల తర్వాత...
2018 సెప్టెంబరులో కతార్ రాజధాని దోహా నగరంలో తాలిబన్లతో శాంతి చర్చలను ట్రంప్ అర్ధంతరంగా నిలిపేశారు. అసలు చర్చించడానికి అంశమంటూ ఏమీ లేదని ప్రకటించి గందరగోళం సృష్టించారు. ఆపై నవంబరు నెలాఖరులో ఆకస్మికంగా అఫ్గానిస్థాన్ వెళ్లిన ట్రంప్ మళ్ళీ చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు నిరుడు నవంబరు మొదటివారంలో జరిగిన చర్చల్లో తాత్కాలికంగా అయినా కాల్పుల విరమణ పాటించాలని అమెరికా పిలుపిచ్చింది. దీనికి స్పందనే తాలిబన్ల తాజా ప్రకటన!
పైకి చెప్పనప్పటికీ అఫ్గాన్లో జోక్యంతో అమెరికాకు తలబొప్పి కట్టింది. దీంతో ఏదో ఒక పేరుతో వీలైనంత త్వరగా తట్టాబుట్టా సర్దుకుని అక్కడి నుంచి నిష్క్రమించాలన్న ఆలోచనతో అగ్రరాజ్యం ఉంది. ప్రస్తుతం 12వేల మంది అమెరికా సైనికులు అఫ్గాన్లో ఉన్నట్లు అంచనా. ఒప్పందం కుదిరితే వీరు వెనక్కు వెళ్లిపోతారు. తాలిబన్లకు కావలసిందీ అదే. అంతర్యుద్ధానికి తెరదించేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ ప్రయత్నించారు. తాలిబన్ల డిమాండ్లపై ఓ మెట్టు దిగేందుకూ ఆయన సిద్ధపడ్డారు. అయితే ఎన్నికలు వద్దన్న తాలిబన్ల డిమాండ్లను తిరస్కరించారు.
అమాయక పౌరులు బలి...
ఏళ్ల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంతో అఫ్గానిస్థాన్ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ప్రజల ప్రాణాలకు పూచిక పుల్లపాటి విలువ లేకుండా పోయింది. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య దాడుల్లో అమాయక పౌరులు హతులవుతున్నారు. కొన్ని సందర్భాల్లో భద్రతాదళాలు సైతం బలవుతున్నాయి. అంతర్యుద్ధం ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. నిత్యావసర సరకుల ధరలు నింగినంటాయి. దీంతో ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. మరోపక్క విద్యారంగం ఉసూరుమంటోంది.
నిత్యం ఘర్షణల కారణంగా బాల్యం విద్యకు దూరమవుతోంది. పదేళ్ల అంతర్యుద్ధంలో లక్షమంది పౌరులు మరణించడమో, లేదా తీవ్ర గాయాల పాలవడమో జరిగింది. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన అధికారిక సమాచారమిది. సగటున దేశంలో రోజుకు వంద మంది మరణించడమో, గాయపడటమో జరుగుతోంది.
విధ్వంసం.. అరాచకం...
స్థానిక ప్రభుత్వం, అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడిన తాలిబన్లు అరాచకాలను సృష్టించారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలపై దాడులకు తెగబడ్డారు. ఓటర్లను బెదిరించారు. కొన్నిచోట్ల అభ్యర్థులను కాల్చి చంపారు. ఒకపక్క శాంతి చర్చలంటూనే మరోపక్క దాడులకు తెగబడటం ఈ ఉగ్రవాద సంస్థ నైజం. అందువల్లే ఇప్పుడు కూడా కాల్పుల విరమణ ప్రకటనకు తాలిబన్లు ఎంతవరకు కట్టుబడి ఉంటారనేది ప్రశ్నార్థకమే! పొరుగున ఉన్న పాకిస్థాన్ అండదండలు తాలిబన్లకు పుష్కలంగా ఉన్నాయి. తాలిబన్ల ద్వారా అఫ్గాన్లో చిచ్చు పెట్టాలన్నది పాకిస్థాన్ లక్ష్యం. దాదాపు సగం దేశాన్ని తాలిబన్లు నియంత్రిస్తున్నారు. వారిని అడ్డుకునే శక్తి భద్రతా దళాలకు లేదన్నది వాస్తవం. ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడుతోంది.
యునిసెఫ్ నివేదికలో తేటతెల్లం...
మరోపక్క దేశంలో బాలల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి భవితవ్యానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదు. దాదాపు సగంమంది బాలలు విద్యకు దూరంగా ఉన్నారు. 2018లో యునిసెఫ్ నివేదిక బయటపెట్టిన చేదునిజమిది. భద్రతా లోపం, పేదరికం, బాల్య వివాహాలు, లింగ విచక్షణ ఇందుకు కారణాలు.
ముఖ్యంగా ఏడు నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం కనాకష్టంగా ఉంది. సంపన్న వర్గాలవారు 10 నుంచి 18 ఏళ్ల వయసు గల మగ పిల్లలను బానిసలుగా మార్చుకుంటున్నారు. సాయుధ ముఠాలు, మాజీ కమాండర్లు, ధనవంతులు, రాజకీయ ప్రాబల్యం గలవారు తమ సామాజిక హోదా, స్థోమతలను చాటుకునేందుకు పేద తల్లిదండ్రుల నుంచి వీరిని కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో అపరిహరిస్తున్నారు. వారితో ఇంటి పనులు చేయిస్తూ బానిసలుగా చూస్తున్నారు. తూర్పు, దక్షిణ ప్రాంతాలు, ఉత్తర అఫ్గాన్లోని తజిక్ ప్రాంతంలోనూ ఈ విష సంస్కృతి విస్తరించింది.
శాంతిస్థాపనకు అవకాశం
అమెరికా కనుసన్నల్లో పనిచేసే అఫ్గాన్ పౌర ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న హమీద్ కర్జాయ్ ప్రభుత్వం అచేతనంగా వ్యవహరించింది. 2014 ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవిని అందుకున్న అష్రాఫ్ ఘనీ శాంతిభద్రతలను చక్కదిద్దడంలో చేతులెత్తేశారు.
కర్జాయ్, ఘనీ ఇద్దరూ అమెరికా కీలుబొమ్మలే. ఘనీ గతంలో ఆర్థికమంత్రిగా, ప్రపంచబ్యాంకులో ఆర్థికవేత్తగా పనిచేశారు. తాజాగా 2018 సెప్టెంబరు 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘనీ విజయం సాధించారు. ఆయనపై పోటీచేసిన అబ్దుల్లా అబ్దుల్లా ఎన్నికల్లో ప్రభుత్వం రిగ్గింగ్కు పాల్పడిందంటూ ఫలితాలను గుర్తించడానికి నిరాకరించారు. ఈయన కూడా అమెరికా మనిషే. గతంలో విదేశాంగ మంత్రిగా, నిన్నమొన్నటి వరకు ఘనీ ప్రభుత్వంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా పనిచేశారు. రిగ్గింగ్ ఆరోపణలను ఐరాసతోపాటు ఎన్నికల సంఘమూ తోసిపుచ్చింది. తాలిబన్ల పాలన అంతం తరవాత పారదర్శకంగా జరిగిన ఎన్నికలు ఇవేనని ఐరాస స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పక్కనపెడితే తాలిబన్ల కాల్పుల విరమణ ప్రకటన ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, అమెరికా చొరవ చూపడం అవసరం!
- గోపరాజు మల్లపరాజు
ఇదీ చూడండి: తాలిబన్లతో ఇకపై చర్చలు జరగవు: డొనాల్డ్ ట్రంప్