అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థి జో బైడెన్ను గెలిపించేందుకు డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 14 భారతీయ భాషల్లో డిజిటల్ గ్రాఫిక్స్ను విడుదల చేసింది. దేశంలోని దక్షిణాసియా ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆశిస్తోంది.
'చల్ చలో బైడెన్ కో ఓట్ దో'(పదండి.. బైడెన్కు ఓటు వేద్దాం) అంటూ సాగే ప్రచార గీతాన్ని ఇప్పటికే విడుదల చేయగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని డెమొక్రటిక్ పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా.. 'జాగో అమెరికా, జాగో, భూల్ న జానా బైడెన్-హారిస్ కో ఓట్ దేనా'(అమెరికా మేలుకో.. బైడెన్కు ఓటు వేయడం మర్చిపోకు) వంటి నినాదాలతో 14 భాషల్లో ఈ డిజిటల్ యాడ్స్ను విడుదల చేసినట్టు స్పష్టం చేసింది.
"సంగీతం, ఆహారం, భాష, సంప్రదాయానికి సంబంధించిన వాటితో ప్రజలు సులభంగా కలిసిపోతారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలకు చేరువ అవుతున్నాం. ఈ డిజిటల్ గ్రాఫిక్స్.. దక్షిణాసియా ఓటర్లలో స్ఫూర్తిని నింపుతాయని ఆశిస్తున్నాం. తదుపరి అధ్యక్ష-ఉపాధ్యక్షులుగా బైడెన్-కమలా హారిస్ను ఎన్నుకొనేందుకు ఇండో అమెరికన్లు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు."
--- అజయ్ భుటోరియా, బైడెన్ ప్రచారాల జాతీయ ఆర్థిక కమిటీ సభ్యుడు.
నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. ఈ నెల 29 నుంచి రిపబ్లికన్ ట్రంప్- డెమొక్రాట్ జో బైడన్ మధ్య అధ్యక్ష ఎన్నికల్లోనే అత్యంత రసవత్తరమైన సంవాదాలు ప్రారంభంకానున్నాయి.
ఇదీ చూడండి:- 'దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించేదే లేదు'